సీఆర్డీఏ గ్రీవెన్స్కు 37 అర్జీలు
తాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ‘గ్రీవెన్స్ డే‘కు 37 అర్జీలు వచ్చాయి. గ్రామ కంఠాలు, ఎల్పీఎస్ లే అవుట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్ తదితర సమస్యల గురించి పలువురు అడిషనల్ కమిషనర్ ఎ. భార్గవ తేజకు అందజేశారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు పలు ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కరించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వసంతరాయడు, జీఆర్ఎం నోడల్ అధికారిణి పి.జయశ్రీ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.శేషిరెడ్డి, కేఎస్ భాగ్యరేఖ, పి.పద్మావతి, ఏజీ చిన్నికృష్ణ, జి. రవీందర్, బి.సాయి శ్రీనివాస్ నాయక్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే(ఎల్ఏ) ఎస్. రవీంద్ర ప్రసాద్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా వజ్రోత్సవ ప్రతిభా పురస్కార కార్యక్రమం
గుంటూరు ఎడ్యుకేషన్: శ్యామలానగర్లోని శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ వజ్రోత్సవ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థిని, ఉత్తరప్రదేశ్ గనులశాఖ కార్యదర్శి మాల శ్రీవాత్సవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృత్తి పరమైన బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ తాను చదివిన పాఠశాలకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ప్రత్యేక అతిథులుగా అనిల్ హర్నాథక, ఐపీఎస్ అధికారి అశ్విన్, మద్ది సుదర్శన్ పాణి, విజయ, ఝాన్సీలక్ష్మి, బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎన్.మంగాదేవి, సంయుక్త కార్యదర్శి జయశ్రీ , సీఏవో దుర్గా రఘురాం, రావెల సాంబశివరావు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీడీపీ జిల్లా అధికార
ప్రతినిధిపై కేసు నమోదు
న్యాయవాదిని దూషించిన చల్లా సుబ్బారావు
నరసరావుపేట టౌన్: న్యాయవాదిని దూషించిన టీడీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావుపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ ఫిరోజ్ శనివారం తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ తనను అసభ్య పరుష పదజాలంతో దూషించాడని వన్టౌన్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. గొడవపడుతూ తిట్టిన ఫోన్ ఆడియో రికార్డును అందజేశారు. ఇచ్చిన ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ కావడంతో న్యాయాధికారి నుంచి వచ్చిన అనుమతితో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు
రాజుపాలెం: ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని గణపవరంలో గల ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలు, స్టాక్ డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచించారు. దుకాణాదారులు ఎరువులు అమ్మినవెంటనే ఈ–పాస్ తప్పని సరిగా చేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి పి.వెంకటనర్సయ్య ఉన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
వేమూరు: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండంలో బేతాళపురంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అట్లూరు సునీల్(22) అదే గ్రామానికి చెందిన కోగంటి శ్రీకాంత్ పొలంలో మొక్కజొన్న పంటకు ఎరువులు దింపేందుకు వెళ్లాడు. ఎరువుల ట్రాక్టర్ను 11 కేవీ లైను కింద పార్క్ చేశారు. సునీల్ కొంత మంది కూలీలతో కలసి ఎరువులను ట్రాక్టర్పైకి లోడు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తగలడంతో కింద పడిపోయాడు. అక్కడ పని చేస్తున్న కూలీలు ద్విచక్ర వాహనంపై సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వెళ్తుండగా మధ్యలోనే మృతి చెందాడు.
తండ్రి ఆత్మహత్య
విషాద వార్త విన్న తండ్రి గుండె తల్లడిల్లిపోయింది. చేతికాడికొచ్చిన బిడ్డను దేవుడు తీసుకెళ్లి పోయాడంటూ విలపించాడు. భార్యను ఏ విధంగా సముదాయించాలని మదనపడ్డాడు. విషాదంలో మునిగిపోయాడు. ఇరుపొరుగు సర్దిచెప్పారు. సాయంత్రానికి తేరుకుంటాడనుకునేలోపు కొడుకు లేని జీవితం ఎందుకని భావించాడు. రైలు కిందపడి తనువు చాలించాడు. శనివారం సాయంత్రం ధర్మపురం వద్ద రేపల్లె నుంచి గుంటూరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సీఆర్డీఏ గ్రీవెన్స్కు 37 అర్జీలు


