ఏఎన్యూ(గుంటూరు) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్ రావు మంగళవారం విడుదల చేశారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31న తుది గడువుగా నిర్ణయించారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ర్యాంక్ పొందిన వారితోపాటు ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు అని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ లు తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డులను వర్సిటీ వైబ్సెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్యూసీడీఈ.ఇన్ఫో నుంచి పొందవచ్చన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వర్సిటీ ఓఎస్డీ ఆచార్య ఆర్వీఎస్ఎస్ రవికుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణవేణి, సూపరింటెండెంట్లు జవ్వాజి శ్రీనివాసరావు, నేలపాటి నాగేశ్వరరావు, వర్సిటీ సిబ్బంది రాధాకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా సుబ్బారెడ్డి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పట్టణానికి చెందిన వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో ఈనెల 23వ తేదీన అసోసియేషన్ సమావేశంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ 4 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా సేవలు అందిస్తున్న సుబ్బారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావటంపై జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, కోశాధికారి వై.వి.శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు.