‘ముస్తాబు’ చేయలేక అవస్థలు
గురువులకు కొత్త అగచాట్లు పాఠశాలల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేయాలని జీవో విడుదల చేసిన చంద్రబాబు సర్కార్ కార్నర్లో అద్దం, దువ్వెన, సబ్బు, నెయిల్ కటర్, హ్యాండ్వాష్ ఉంచాలి ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
ఒత్తిడికి గురిచేయడమే..
ప్రత్తిపాడు: అయ్యవార్లకు కొత్త అగచాట్లు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారంటూ నానా రచ్చ చేసిన అప్పటి ప్రతిపక్షం, గద్దెనెక్కిన తరువాత నాడు చెప్పిన మాటలను విస్మరించింది. బోధనేతర పనులు అప్పగిస్తుండడంపై ఉపాధ్యాయులు కస్సుబుస్సు లాడుతున్నారు. ఇప్పటికే పది తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణకు ఒక్కో పాఠశాలకు నోడల్ ఆఫీసర్ చొప్పున ఇతర శాఖల అధికారులను నియమించారు. ఇతర శాఖల కర్ర పెత్తనం ఏమిటంటూ రగిలిపోతున్న పంతుళ్లపై చంద్రబాబు సర్కారు ముస్తాబు పేరుతో మరో అదనపు పని భారం మోపింది. దీంతో విద్యార్థులను ‘ముస్తాబు’ చేయలేక చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జీవో విడుదల
ప్రభుత్వ పాఠశాలల్లో డైలీ హైజీన్ అండ్ డిసిప్లిన్ పేరుతో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఈనెల 19 నుంచి అమలు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 43 ఇచ్చింది. తప్పనిసరిగా ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలి. అందులో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్ ఉంచాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. అంతేకాకుండా చేతులు శుభ్రం చేసుకోనే దశల చార్టులు, గోర్లు, జుత్తు, వ్యక్తిగత పరిశుభత్ర చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అనుకూలమైన ఐఈసీ మెటీరియల్ను కూడా ప్రదర్శించాలి. ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇవ్వాలి. వారం వారం ముస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్లను ఎంపిక చేయడం, రివార్డులివ్వడం చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చే విద్యార్థులు, తలదువ్వుకోకుండా వచ్చే విద్యార్థులను గుర్తించాలి. వారితో బడిలోనే తలదువ్వడం, లేదా దువ్వించడం చేయించాలి. అయితే, ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు వర్గాలు, యూనియన్లు భగ్గుమంటున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా లేక ముస్తాబు చేయాలా, చేయిస్తూ కూర్చోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం
వాస్తవానికి ఈ కార్యక్రమం మూడు రోజుల కిందటే ప్రారంభమైనప్పటికీ సగానికి పైగా పాఠశాలల్లో నిర్వహించిన జాడలే లేవు. ప్రధానోపాధ్యాయుల్లో ఆసక్తి కరువడంతో కొన్ని బడుల్లో ముస్తాబు కార్నర్లు కనిపించని పరిస్థితి చోటుచేసుకుంది. మరికొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఎన్నికలకు ముందు కన్నీళ్లు తుడిచేందుకు కల్లబొల్లి మాటలు చెప్పి కాలం నెట్టుకొచ్చిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు బోధనేతర బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
దువ్విన తలనే దువ్వుతూ..
వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్ర పరుచుకోవడం వంటివి అవసరమే. అయితే విద్యాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో దువ్వెన, అద్దం, సబ్బు వంటివి ఉంచడం వల్ల వారు చదువుపై కన్నా వ్యక్తిగత సౌందర్యం పైనే శ్రద్ధ చూపే అవకాశాలూ లేకపోలేదు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎలా ఉన్నా ఆ ప్రభావం హైస్కూల్స్పై పడే ప్రమాదం లేకపోలేదు. దీంతో తల్లిదండ్రులు, గురువులు ఇవేమి ఉత్తర్వులంటూ వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో పాఠశాలలు, ఉపాధ్యాయుల లెక్క
ప్రైమరీ స్కూల్స్ : 609
యూపీ స్కూల్స్ : 25
హైస్కూల్స్ : 130
విద్యార్థులు : 51,982
ఉపాధ్యాయులు : 3,429
‘ముస్తాబు’ చేయలేక అవస్థలు
‘ముస్తాబు’ చేయలేక అవస్థలు
‘ముస్తాబు’ చేయలేక అవస్థలు
‘ముస్తాబు’ చేయలేక అవస్థలు


