‘దేశం లోపల’ మోదీకి ఇప్పుడు చాలా ‘ప్రతిష్ఠ’ ఉంది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత అది మరింతగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రతిష్ఠ ‘దేశం వెలుపల’ కూడా ఆయనకు కావాలి. అది రావాలి అంటే పడిపోతున్న రూపాయిని అంతకన్నా పడిపోకుండా పట్టుకోవడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవడం మార్గాలు. మోదీ పన్నెండేళ్ల పాలనలో రూపాయి విలువ పడిలేస్తూనే ఉంది. ఆయన మొదటిసారి ప్రధాన మంత్రి అయినప్పుడు (2014 మే నాటికి) అమెరికన్ డాలర్ 58.3 రూపాయలుగా ఉండేది. ఇప్పుడది 94.5 రూపాయల వద్ద ఉంది. రూపా యితో పోల్చుకుంటే డాలర్ 62 శాతం పెరిగింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి 38 శాతం పడిపోయింది. అది ఇంకా ఇంకా పడిపోకుండా ఉండాలంటే, ‘విదేశీ మారక ద్రవ్యం’ పెరగాలి. ఆ పనిలో ఇప్పుడు భారత ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకూ తలమునకలై ఉన్నాయి.
దానికోసం ‘ఫుల్లీ యాక్సెస్బుల్ రూట్’ అనే విధానాన్ని ప్రభుత్వం విస్తృతం చేయబోతోంది. అంటే– 15, 30, 40 ఏళ్ల ప్రభుత్వ బాండ్లను విడుదల చేయడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టు బడిదారులకు ఇప్పటికి ఉన్న పరిమితులను తొలగించడం, దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్ను మినహాయింపు ఇవ్వడం, ప్రభుత్వ బాండ్ల విక్ర యంపైన 20% పన్ను నిలిపివేయడం – ఇంకా ఇలాంటి కొన్ని సడలింపుల్ని చేయబోతోంది. ఇవన్నీ చేస్తే, అప్పుడు – ఎగుమతులు పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు రావడం, ప్రవాస భారతీయుల నుంచి డబ్బు రాక పెరగడం, విదేశీ రుణాలు లేదా డిపాజిట్లు పెరగడం, దిగుమతులపై ఖర్చు తగ్గడం లాంటివి సంభవిస్తాయి. దాని ఫలితంగా ఫారెక్స్ పెరిగి, కనీసంగా 30–40 బిలియన్ డాలర్లు వస్తే, అప్పుడు రూపాయి తనకాళ్ల మీద తాను నిలబడు తుందని ప్రభుత్వ అభిప్రాయం.
ఈ నెలలో, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పింది కూడా ఇదే. కొన్ని చోట్ల మోదీని ముద్దుగా విమర్శించినప్పటికీ ఈయన కూడా ఆ ‘తాను’లో ముక్కే. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న 2013లో ‘టేపర్ టాంట్రం’ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు (అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించగానే, పెట్టుబడులన్నీ భారత్ వంటి దేశాలకు వచ్చి, వడ్డీ రేట్లు కొంచం పెంచగానే తిరిగి అమెరికాకు చేరినప్పుడు) రూపాయి విలువ డాలర్ ముందు 68కి పడిపోయింది. అప్పుడు తనకి ఆర్థిక సలహా దారు అయిన రఘురామ్ రాజన్ ఎలాంటి సలహాలు ఇచ్చారో, ఇప్పుడు మోదీకి కూడా అనంత నాగేశ్వరన్ అలాంటి సలహాలే ఇస్తున్నారు. ఆ సలహా పేరే ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్.’
ఆర్థిక పరిభాషలో దీన్ని ‘హాట్ మనీ ఫ్లో’ అంటారు. అంటే – ‘స్వల్పకాలిక విదేశీ మూలధన ప్రవాహం’. విదేశీ పెట్టుబడిదారులు తమ తమ లాభాల కోసం ఒక దేశంలోకి వేగంగా తీసుకువచ్చే డబ్బు ఇది. 1950–60ల నుంచే ‘అంతర్జాతీయ ఆర్థిక రంగం’లో ఈ మాట విస్తృతంగా వాడుకలో వచ్చింది. ఇదొక ‘ప్రమాదకరమైన ఆర్థిక ధోరణి’. స్థానిక చర్యలూ తప్పనిసరి! ఇలాంటి ధోరణి వల్లనే 1997లో ఆసియాలో ఒకసారి ‘ఆర్థిక సంక్షోభం’ వచ్చింది. దీని వలన థాయ్లాండ్లో ‘తాయ్ బాత్’ విలువ కుప్పకూలింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా డబ్బు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ఆ ప్రభావం ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకూ వ్యాపించింది. పెట్టుబడి దారులు లాభాలు కనిపించినంత వరకు డబ్బు పెట్టారు. ప్రమాదం ఉందని అనిపించగానే ఒకేసారి వెనక్కి తీసుకున్నారు. దీంతో స్థానిక కరెన్సీల విలు వలు ఒక్కసారిగా, 30%–80% వరకు పడి పోయాయి. అనేక కంపెనీలు, బ్యాంకులు దివాలా తీశాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ‘హాట్ మనీ త్వరగా వస్తుంది, కానీ భయం కలిగితే అంతే త్వరగా పారిపోతుంది. కాబట్టి దానిపై ఎక్కువగా ఆధారపడకూడదు’ అని, టర్కీ ఆర్థికవేత్త డానీ రాడ్రిక్ అంటారు.
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ వేగంగా పడిపోకుండా ఉండాలంటే, హాట్ మనీ ఒక్క దాన్నే మార్గంగా పెట్టుకోకుండా, తయారీ రంగంలో పెట్టుబడుల్ని పెడుతూ ఎగుమతుల్ని బాగా పెంచుకోవాలనీ, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాలనీ, ప్రభుత్వ వ్యయం పెంచి ఉద్యోగాలు సృష్టించాలనీ, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ వంటి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలనీ ఆర్థికవేత్తలు చెబుతారు. ప్రస్తుతం మనం ‘పెట్టుబడిదారీ ప్రపంచం’లో ఉన్నాం. ‘మార్కెట్ ఎకనామీ’లో ఉన్నాం. ఇక్కడ రూపాయి పడిపోవడం, లేవడం సర్వసాధారణం. వాటిని పూర్తిగా నియంత్రించే ఆర్థిక వాతావరణం ఉండదు. రూపాయిని నిలబెట్టడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడంపైనే దృష్టి కేంద్రీకరిస్తే సరి పోదు. స్థానికంగానూ కొన్ని చర్యలు తీసుకోవాలి: ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ ఆర్థిక క్రమ శిక్షణ, దేశీయ పొదుపుల పెంపు, పారిశ్రామికీకరణ, ఉత్పాదకత పెంపు, దిగుమతులను తగ్గించడం, ఇంధన స్వావలంబన, అలాగే అన్నింటికన్నా, ప్రజల్లో ‘కొనుగోలు శక్తిని’ పెంచే దిశగా ప్రయాణించడం!
– నన్నూరి వేణుగోపాల్ ‘ విశ్లేషకుడు


