ప్రతిభకు పట్టం | Guest Column Spiritual And Devotional Story On Lord Sri Ram | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పట్టం

Jul 18 2026 7:21 AM | Updated on Jul 18 2026 8:38 AM

Guest Column Spiritual And Devotional Story On Lord Sri Ram

భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.

వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.

చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్‌ఆర్‌ నాయకులు, ప్రాజెక్ట్‌ మేనేజర్లకు విలువైన పాఠం.
– డా. బాలాజీ దీక్షితులు పి.వి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement