అంతర్జాతీయ చైతన్య గీతిక

G Kishan Reddy Article on 8th International Yoga Day - Sakshi

విశ్లేషణ

భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. 2014లో ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు మానవాళికి యోగా ఒక సాధనమైంది. మరో 50 రోజుల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఆ రోజు అందరం సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృ త్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 మే నెలలో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన జీవన వ్యవస్థపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. 2014 నవంబర్‌లో ప్రత్యేకంగా ఆయుష్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయడం ద్వారా ఆయుర్వేదం, యోగా వంటి ఏడు సంప్రదాయ భారతీయ పద్ధతులను ప్రజారోగ్య సంక్షేమ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. 2014 డిసెంబర్‌ నాటికి ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు కలిసి యోగా ఆవశ్యకతను అంగీకరించి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 2016 జూన్‌లో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... యోగా విషయంలో భారతదేశం మేధా సంపత్తి హక్కులను (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌) తీసుకోలేదనీ, భారతీయ జ్ఞానసంపద సమస్త మానవాళికి నిరంతరం అందుబాటులోనే ఉంటుందనీ పేర్కొన్నారు. ‘యోగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజ లందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశం ఇచ్చిన విలువైన కానుక’ అని వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రధాన మంత్రి బహిరంగంగానే వెల్లడించారు.

ఇది అందరి ఆస్తి
యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. 

అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. తూర్పున ఉన్న వ్లాదివస్తోక్‌ నుంచి పశ్చిమాన ఉన్న వాంకోవర్‌ వరకు, దక్షిణాన ఉన్న కేప్‌టౌన్‌ నుంచి ఉత్తరాన ఉన్న కోపెన్‌హాగన్‌ వరకు ప్రతి నగరం యోగాలోని శక్తినీ, రోగనిరోధక సామర్థ్యాన్నీ గుర్తించి వినియో గంలోకి తీసుకొచ్చింది. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న వారందరూ... ఆనందకర జీవితాన్ని పొందుతున్న తీరే ఇందుకు నిదర్శనం. వివిధ వ్యాధులకు సరైన చికిత్స నుంచి మరికొన్ని సమస్యలు రాకుండా నివారించుకునేందుకు యోగా ఓ సాధనంగా మారింది. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా యోగా మానవాళి ఆరోగ్యానికి అత్యవసర, నిత్యావసర సాధనకు వేదికైంది.

ఎన్డీయే కృషి
యోగా అత్యంత ప్రాచీనమైన భారతీయ సంపద అయినప్పటికీ... ఇటీవలి కాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆమోదించి తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడం వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పోషించిన పాత్ర చిరస్మరణీయం, అభినందనీయం.

2014కి ముందు అప్పటి ప్రభుత్వ హయాంలో లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు లేవనెత్తిన రెండు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటే... యోగా, సంప్రదాయ భారతీయ విజ్ఞాన వ్యవస్థల పట్ల అప్పటి ప్రభుత్వం చూపించిన ఉదాసీనత, నిర్లక్ష్యం ఎలాంటివో చక్కగా అర్థమవుతాయి. 2007 ఆగస్టులో లోక్‌సభలో ‘అమెరికాకు చెందిన పేటెంట్స్, ట్రేడ్‌ మార్క్‌ ఆఫీసు వారు యోగాపై మేధా సంపత్తి హక్కులను అమెరికా ప్రభుత్వానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. యోగా భారతీయ సనాతన సంప్రదాయ విధానం అయినందున, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిం చిందా, లేదా?’ అన్న ప్రశ్న వచ్చింది. నాటి ప్రభుత్వం ‘ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలేమీ లేదు’ అని సుస్పష్టంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా 2014 ఫిబ్ర వరిలో, అంటే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యేం దుకు కొద్దిరోజుల ముందు, నాటి ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... మార్చి 2009లో యోగాపై ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ ఇంతవరకు తమ నివేదికను సభకు అందజేయలేదని తెలిపింది. 
గత ప్రభుత్వాలు యోగా, భారతీయ సనాతన వ్యవస్థ విష యంలో నిర్లిప్తతను ప్రదర్శిస్తే... ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు దక్కేలా కృషి చేసింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే!

ఎనిమిదో వేడుకకు సిద్ధం
మరో 50 రోజుల్లో అంటే జూన్‌ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతున్న సందర్భమిది. ఏడాదికేడాది యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. గతేడాది కరోనా నేపథ్యంలో మన దేశంలో 15 కోట్లకు పైగా మంది అంతర్జాతీయ యోగా ఉత్సవం నాడు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
భారతదేశ స్వాతంత్య్ర సాధనకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ జరుపుకొంటున్న ప్రస్తుత తరుణంలో ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం, మన స్వాతంత్య్ర సంగ్రామంలో సర్వస్వాన్నీ త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఘనకీర్తిని స్మరించుకోవడం, అసువులు బాసిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చేస్తున్నాం. మన సంస్కృతీ సంప్రదాయాలనూ, వైభవోపేతమైన చరిత్రనూ, ఘనమైన వారసత్వ సంపదనూ కాపాడుకునేందుకు నడుం బిగిస్తున్నాం.

కలిసి చేద్దాం యోగా!
మన చరిత్రనూ, మన సనాతన జీవన విధానాలనూ చెరిపేసేందుకు జరిగిన ఎన్నో కుట్రలను ఎదుర్కొని మన సాంస్కృతిక వైభవాన్ని కాపాడేందుకు మన పెద్దలు చేసిన త్యాగం నిరుపమానమైనది. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన సనాతన జీవన జ్ఞాన సంపదను గుర్తుచేసుకుంటూ, వారు వారసత్వంగా ఇచ్చిన యోగాలో నిగూఢంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను ఘనమైన ఉత్సవంగా జరుపుకొనేందుకూ ఇంతకు మించిన మరో సందర్భం ఏముంటుంది!
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. అయితే దీన్ని మరపురాని ఘట్టంగా మార్చేందుకు ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వేతర సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, యోగా ప్రేమికులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోట్లాది మంది జీవితాల్లో ఓ భాగంగా మారిన యోగాను మరింత ముందుకు తీసుకెళ్లాలి. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలతో పాటు జాతీయ చైతన్య భావన జాగృతమైంది. 

రండి, అందరూ కలసి రండి. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజు మీ ఇంట్లో, మీ బస్తీలో, మీ వాడల్లో, గ్రామాలలో, విద్యా సంస్థలలో, మీ కార్యాలయాలలో యోగా చేయండి. సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. మన వారసత్వ సంపదను మన జీవితాలలో నిత్యకృత్యంగా మార్చుకుందాం. 

వ్యాసకర్త: జి. కిషన్‌ రెడ్డి 
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top