బిడ్డ పుట్టినప్పుడే తల్లీ పుడుతుంది... | World Breastfeeding Week Importance Of Breast Milk For Newborn Health Benefits | Sakshi
Sakshi News home page

బిడ్డ పుట్టినప్పుడే తల్లీ పుడుతుంది...

Aug 5 2026 1:05 AM | Updated on Aug 5 2026 1:05 AM

World Breastfeeding Week Importance Of Breast Milk For Newborn Health Benefits

తల్లిపాల వారోత్సవాలు

తల్లి క్షేమానికి సురక్షితమైన ప్రసవం ఎంత ముఖ్యమో, ప్రసవానంతరం బిడ్డ క్షేమానికి పాలు పట్టడమూ అంతే ముఖ్యం. శిశువు తర్వాతి దశలలో ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు తాగడం ఒక్కటే సరైన పరిష్కారం. బిడ్డ పుట్టిందనే ఆనందం మాత్రమే కాదు అదే సమయంలో స్త్రీ తల్లిగా కొత్త జన్మ ఎత్తుతుందని, ఆ జన్మను మరింత దివ్యంగా మార్చుకునే శక్తి ఆమెకే ఉందని ప్రపంచస్థాయిలో ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో తల్లికి కుటుంబ మద్దతు, వైద్యుల సూచనలు తప్పనిసరి అవసరం...

ఔషధం లాంటి అమ్మపాలు బిడ్డకు అమృతమే. సహజ పోషకాహారం. బిడ్డ ఆరోగ్యకరమైన భావి జీవితానికి ఎంతో విలువైనవి. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌తో పాటు పలు నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమ్మపాల ్రపాధాన్యత గురించి, బిడ్డకు లభించిన జన్మహక్కు గురించి మరింత వివరంగా తెలుసుకోవడం, తెలియజెప్పడం మన విధి.

ఇన్ఫెక్షన్ల నివారిణి...
తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలావరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్కా అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శక్తి ప్రదాయిని. సాధారణ సిజేరియన్‌ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. – డాక్టర్‌ శిరీష, గైనకాలజిస్ట్‌

బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతి
ముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలొస్ట్రమ్‌ అంటారు. ‘ప్రీ మిల్క్‌’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్ట్‌ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టాలని, ‘మొదటి గంట’ మరీ కీలకం అని యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

ఇంతగా తల్లిపాల విశిష్టతను తెలియజేయడానికి కారణం శిశువు ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఆ పాలలో ఉంటాయి. ్ర΄÷టీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం.

తల్లి పాలు ఇవ్వడం ద్వారా... 
శిశువులోనూ, తల్లిలోనూ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మాతా – శిశు మరణాల రేటు తగ్గించవచ్చు. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు మేధో పరీక్షలలో మెరుగ్గా రాణిస్తారు. అధికబరువు లేదా ఊబకాయం బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువ ∙తల్లిపాలు ఇచ్చే మహిళలకు రొమ్ము, అండాశయ కాన్సర్ల ప్రమాదం కూడా తక్కువ ఉంటుంది. ఆరోగ్యంగా పెరగడం వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. తల్లిపాల పెంపుదలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. తల్లిపాలు అందక ఇప్పటికీ ప్రతి వెయ్యి నవజాత శిశువులలో 224 నుంచి 263 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నేటికీ 6 నెలల లోపు శిశువులలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

పని ప్రదేశాలలో తల్లిపాలకు మద్దతు
పిల్లల జీవితంలో ఆరోగ్యకరమైన పునాది వేసేది తల్లిపాలు. శిశు, చిన్న పిల్లల పోషణలో అవగాహన మాత్రమే తల్లిపాలు ఇచ్చే శాతాన్ని పెంచుతాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ సంస్థ 16 అధ్యయనాల అంచనాలను క్రోడీకరించి ఆరోగ్య కేంద్రాలు, సంఘాలు, ఇళ్లలో చెప్పడం ద్వారా తల్లిపాలు ఇచ్చే రేటు  58 శాతం పెరిగిందని వివరించింది. ∙15,096 మంది నవజాత శిశువులపై జరిపిన అధ్యయనాలలో బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్‌ ఇనిషియేటివ్‌ (బిఎఫ్‌హెచ్‌ఐ) వల్ల శిశువు 6 నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చేవారి సంఖ్యలో 45 శాతం పెరిగిందని, ఆ తర్వాత కొనసాగించేవారి సంఖ్య 26 శాతం మాత్రమే పెరిగిందని వివరించింది ∙మీడియా జోక్యం ద్వారా 17 శాతం తల్లిపాలు పట్టడాన్ని పెంచిందని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది ∙వేతనంతో కూడిన ప్రసూతి సెలవు వల్ల తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్య 52 శాతం పెరిగిందని తేలింది. పని ప్రదేశంలో శిశువులకు తల్లిపాలు పట్టడానికి మద్దతు ఇచ్చే విధానాలు, కార్యక్రమాలు తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్యను గణనీయంగా పెంచుతాయని అభి్రపాయపడింది.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement