
గత పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
అనేకప్రాంతాల్లో నీటమునిగిన కూరగాయల తోటలు
సరుకు కొరతతో మండుతున్న ధరలు
10–20శాతం పెరిగిన ఆకుకూరలు, కూరగాయల రేట్లు
దాదర్: గత వారం, పదిరోజులుగా రాష్టవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల వివిధ రకాల పంటలతోపాటు కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూరగాయల తోటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ట్రక్కులు, టెంపోలలో రవాణాకు సిద్ధంగా ఉంచిన కూరగాయలు కుళ్లిపోవడంతో అక్కడే రోడ్లపై పారేయాల్సిన పరిస్ధితి వచి్చంది. ఫలితంగా న్యూ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ), అలాగే థానేలోని హోల్సేల్ మార్కెట్లలో కూరగాయల లోడుతో వచ్చే వాహనాల సంఖ్య తగ్గిపోయింది. సరుకు కొరత ఏర్పడడంతో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు అకాల వర్షాల వల్ల చుక్కలను తాకుతున్నాయి. అసలే వర్షాలు, ఆపై కూరగాయల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
18 ఏళ్ల తరువాత మళ్లీ...
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత వారం, పదిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కొంత ముందుగానే ఆరంభమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 20 రోజుల ముందుగానే ఊహించని వర్షాలతో సామాన్య జనాలతో పాటు రైతులు కూడా ఆందోళనకు గురయ్యారు. గత 18 ఏళ్ల కిందట మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు రికార్డు బ్రేక్ చేశాయని కొలాబా, శాంటాకృజ్ వాతావరణ శాఖలు తెలిపాయి.
చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!
ఇలాగే ఉంటే...మరింత పైపైకి...
కొద్ది నెలలుగా స్ధిరంగా కూరగాయలు, ఉల్లి, బంగాళదుంపలు, టమాటాలు, ఆకు కూరల ధరలు కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటుండటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు. కొరత కారణంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు ఇప్పటికే 10–20 శాతం పెరిగాయి.రాష్ట్రంలోని అనేక జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సరుకులు కుళ్లీపోకే ముందే అక్కడే ఖాళీ చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి కనీసం పెట్టుబడి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రేట్లు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.
ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు