వైరల్
నీళ్లు కూడా వ్యాపారంగా మారిన ఈరోజుల్లో డెబ్బై ఏడేళ్ల థానా రామ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. రాజస్థాన్కు చెందిన థానా రామ్ గత రెండు దశాబ్దాలుగా బాటసారులకు ఉచిత నీరు అందిస్తున్నాడు. బార్మర్లోని రద్దీ రహదారి వెంబడి రోడ్డు దాటుతున్న ప్రజలకు చల్లటి తాగు నీరు బాటిళ్లను అందిస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.
బార్మర్–బటాడు మార్గంలో బస్సు ప్రయాణీకులు, ట్యాక్సీ డ్రైవర్లు, బాటసారుల కోసం ప్రతిరోజూ ఖాళీ బాటిల్స్లో చల్లటి తాగునీరు నింపుతూ కనిపిస్తాడు థానా రామ్. వేసవిలో ఉష్ణోగ్రతలు రోజూ 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ చేరుకునే ఈ ప్రాంతంలో థానా రామ్ చేసే సహాయం ఎంతోమందికి ఉపశమనాన్ని ఇస్తోంది. ఈ పని కోసం ఆయన విరాళాల సేకరించడం లేదు. తాను చేస్తున్న పనికి ప్రచారం రావాలని కూడా అనుకోలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో చాలామందికి థానా రామ్ గురించి తెలిసింది.


