పిల్లల కథ
సుందరవనంలో ఐరావతం అనే ఒక ఏనుగు ఉండేది. అది అన్నింటికీ సాయం చేసేది. ఇలా ఉండగా, ఒకరోజు ఒక జింక పిల్ల ఆహారం కోసం బయలుదేరింది. దానికి ఎదురుగా ఆకస్మికంగా ఒక పెద్దపులి కనబడింది. వెంటనే అది ఆ పెద్దపులిని చూసి భయంతో ఆగిపోయింది. ఆ పులి భయానికి అది తప్పించుకోవడానికి దారి లేక అది తనకు చావు తప్పదని భావించి అక్కడ ఉన్న చోటనే కళ్ళు మూసుకొంది.
ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన ఐరావతం అది చూసి, పరిగెత్తి వస్తున్న ఆ పులిని ఆగమని చెప్పింది. కానీ ఆ పెద్దపులి దాని మాటను పట్టించుకోకుండా ఆ జింక పైకి దూకాలని పరుగున వచ్చింది. వెంటనే ఆ ఐరావతం ఆ కళ్ళు మూసుకున్న ఆ జింకను తన తొండంతో ముందుకు ఒక్క తోపు తోసింది.
ఆ జింక కొంత ముందుకు వెళ్లి నేలపై పడిపోయింది. ఆ పులి తన పరుగును అదుపులో పెట్టుకోలేక అడ్డుగా అక్కడ జింక లేకపోవడంతో దాని వెనుక ఉన్న గోతిలో అమాంతంగా పడిపోయింది. ఆ జింక కళ్ళు తెరిచి చూసి తన ప్రాణాలు దక్కాయని సంతోషించి తనకు సాయం చేసిన ఏనుగుకు ధన్యవాదాలు తెలిపి సంతోషంతో వెళ్ళిపోయింది ఆ గోతిలో పడిన పెద్దపులి ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నీవు అందరికీ సాయం చేస్తావే! మరి నన్ను కూడా కాపాడవా!’ అని అరిచింది.
వెంటనే ఏనుగు ‘ఓ పులి రాజా! నేను ఆగమని చెబితే నీవు నా మాట వినలేదు. ఇక్కడ గొయ్యి ఉందని నాకు తెలిసే నేను నిన్ను ఆగమన్నాను. కానీ నీవు ఆగకుండా ఆ జింకపై దాడి చేయాలని చూశావు. అందుకే దాన్ని ముందుకు తోసి కాపాడాను. ఇప్పుడు నిన్ను కూడా కాపాడుతాను. నీవు భయపడకు’ అని కొన్ని కలప దుంగలను, ఆకులు అలములు తెచ్చి ఆ గోతిలో వేసి దానిని కూడా కాపాడింది. ఆ పులి కూడా ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయింది. తర్వాత ఆ ఏనుగు నడిచి పోతుండగా, దానికి ’కాపాడండీ! కాపాడండీ’ అని అరుపులు వినిపించాయి. ఆ ఏనుగు పరుగున వెళ్లి ఆ అరుపులు వచ్చిన వైపుకు వెళ్లింది.
అక్కడ దానికి ఒక చిట్టి చిలుకను పట్టుకున్న ఒక నక్క కనిపించింది. ఆ చిట్టి చిలుక ఆ ఏనుగును చూసి, ‘ఓ ఐరావతమా! నన్ను ఈ నక్క నుండి కాపాడవా!’ అని దీనంగా అరచింది. ఆ ఏనుగు అది విని నక్కతో ఆ చిలుకను వదిలిపెట్టమని కోరింది. కానీ ఆ నక్క దాని మాటను వినలేదు. ‘ఓ ఐరావతమా! నేను దొరికిన ఆహారాన్ని వదలిపెట్టేంత మూర్ఖురాలిని కాదు. నీవు ఇక్కడి నుండి వెళ్లు’ అంది. అప్పుడు ఏనుగు ఒక కర్రను తన తొండంతో తీసి ఆ నక్క పైకి విసిరింది. ఆ నక్కకు ఆ కర్ర తాకి అది ‘కుయ్యో! మొర్రో!’ అని అరిచింది. వెంటనే దాని నోరు వదులై ఆ నోటిలోంచి ఊడిపడ్డ చిట్టి చిలుక రివ్వున ఎగురుకుంటూ ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది.
తనపై కర్రను విసరిన ఏనుగును చూడగానే నక్కకు చాలా కోపం వచ్చింది. అది ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నాకు ఆహారం లేకుండా చేస్తావా! నీ సంగతి మృగరాజు సింహానికి చెబుతాను’ అని సింహం వద్దకు వెళ్లి ఐరావతం తనపై కర్రతో దాడి చేసిందని ఫిర్యాదు చేసింది.
సింహం నవ్వి ‘నీవు చిట్టి చిలుకను పట్టుకొన్నావన్న సంగతి చెప్పడం లేదెందుకు? నాకు ఒక కాకి అంతా చెప్పిందిలే! ఆ చిట్టి చిలుకను నీవు పట్టుకొంటావా! చిన్న పిల్లల్ని పట్టుకోవద్దని, వారికి హాని చేయవద్దని నేను నీకు చెప్పలేదా! నీకు తగినశాస్తి జరిగింది’ అని నక్కను మందలించింది. నక్క చేసేది లేక ఉస్సూరుమనుకొంటూ అక్కడి నుంచి కదిలింది. తర్వాత ఆ సింహం ఐరావతాన్ని పిలిపించి అది చేసిన సాయానికి మెచ్చి, దానిని జంతువుల ముందు ప్రశంసించి ఘనంగా సత్కరించింది.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
హిత వచనం..
తనతో ఏ వైరం లేకుండా సుఖంగా ఉన్నవాడికి దుఃఖం కలిగించినవాడు జన్మజన్మాంతరాలలో దుఃఖం పొందుతాడు. ఇందులో సందేహం లేదు.


