అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం | The Story Of Ashtavakrudi Poorvajanma As Written By Sankhayana | Sakshi
Sakshi News home page

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

Jun 21 2026 9:18 AM | Updated on Jun 21 2026 9:18 AM

The Story Of Ashtavakrudi Poorvajanma As Written By Sankhayana

భక్త విజయం

బ్రహ్మమానస పుత్రుడైన ప్రచేతనుడికి అసితుడు అనే కొడుకు ఉన్నాడు. అసితుడు బ్రహ్మచర్యాశ్రమంలో సకల విద్యలను అభ్యసించి, తపోవృత్తి కొనసాగించాడు. కొంతకాలానికి అసితుడు వివాహం చేసుకున్నాడు. ఎన్నేళ్లయినా సంతానం కలగకపోవడంతో పరమశివుడి గురించి తపస్సు చేశాడు.

పరమశివుడు అతడికి ప్రత్యక్షమై రాధామంత్రాన్ని ఉపదేశించాడు. రాధామంత్ర ప్రభావంతో అసితుడి భార్య గర్భం దాల్చింది. నెలలు నిండాక పండంటి కొడుకు పుట్టాడు. అతడికి దేవలుడు అనే పేరు పెట్టారు. దేవలుడు యుక్తవయస్కుడయ్యాక మాలావతిని పెళ్లాడి, సంతానం పొందాడు. చివరకు విరక్తుడై, ఘోర తపస్సు ప్రారంభించాడు.
దేవలుడి తపో తీవ్రతకు దేవేంద్రుడు భయపడ్డాడు. అతడి తపస్సును ఎలాగైనా భంగపరచాలనుకున్నాడు. రంభను పిలిచి, ‘నువ్వు ఎలాగైనా దేవలుడి తపస్సును భంగపరచాలి’ అని ఆదేశించాడు.

ఇంద్రుడి ఆజ్ఞ మేరకు రంభ భూలోకానికి దిగివచ్చింది. దేవలుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి, అతడి తపోభంగం కోసం తన గాన, నాట్య కౌశలాలను అలుపెరగకుండా ప్రదర్శించింది. తపస్సమాధిలో ఉన్న అతడికి సపర్యలు చేయడం ప్రారంభించింది. అయినా దేవలుడు కన్నుతెరిచి ఆమెను చూడనైనా చూడలేదు. తన శాయశక్తులా ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంతో విసిగి వేసారిపోయిన రంభ ‘దేవలా! నువ్వు నన్ను అష్టకష్టాలపాలు చేశావు. మరుజన్మలో నువ్వు అష్టావక్రుడిగా జన్మిస్తావు’ అని శపించింది. రంభ అంత దారుణంగా శపించినా, దేవలుడు తన తపస్సమాధిలోనే నిశ్చలంగా ఉన్నాడు. దేవలుడి స్థితి చూసి రంభ పశ్చాత్తాపం చెందింది. ‘నిన్ను అనవసరంగా శపించాను. నువ్వు అష్టావక్రుడిగా జన్మించినా, నీ తండ్రి కృప వల్ల దివ్యశరీరుడివి కాగలవు.’ అని పలికింది.
∙∙ 
ఏకపాదుడు తన ఆశ్రమంలో శిష్యులకు వేదం బోధించేవాడు. ఏకపాదుడి శిక్షణ కఠినంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిష్యుల చేత వేదం వల్లె వేయించేవాడు. సుజాత గర్భంలో ఉన్న దేవలుడు ‘గర్భంలో ఉన్న నాకే రోజూ వింటున్న వేదం కంఠోపాఠమైంది. నీ శిష్యులు రోజూ వల్లె వేస్తూనే ఉన్నారు. వారినెందుకు ఉభయ సంధ్యల్లోనూ వేదం వల్లె వేయమంటూ అంతలా హింసిస్తావు? ’ అని తండ్రిని ప్రశ్నించాడు.

ఏకపాదుడు సహించలేకపోయాడు. ‘తండ్రినైన నా శిక్షణ విధానాన్ని వక్రంగా హేళన చేస్తావా? నువ్వు అష్టవంకరలతో జన్మిస్తావు’ అని శపించాడు. ప్రసవ సమయం దగ్గరపడుతున్న రోజుల్లో సుజాత ఒకనాడు ఇంటికి కావలసిన సంభారాలను తెమ్మని భర్త ఏకపాదుడిని కోరింది. అతడు ధనం కోసం జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. ‘వరుణ కుమారుడైన వందితో వాదంలో నెగ్గినట్లయితే, కోరినదంతా ఇస్తాను. వాదంలో ఓడిపోతే జలమజ్జితుడవై ఉండాలి’ అన్నాడు.

ఏకపాదుడు సరేనని వందితో వాదానికి తలపడ్డాడు. వాదంలో ఓడిపోయి, జలమజ్జితుడై, నిర్బంధంలో చిక్కుకుపోయాడు. కొన్నాళ్లకు సుజాత మగబిడ్డను ప్రసవించింది. తండ్రి శాపఫలితంగా అతడు ఎనిమిది వంకరలతో జన్మించి, అష్టావక్రుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అదే సమయంలో సుజాత తల్లి, ఉద్దాలకుడి భార్య ఒక కొడుకును కన్నది. అతడు శ్వేతకేతుడు. ఉద్దాలకుడి వద్ద శ్వేతకేతుడితో పాటు అష్టావక్రుడు కూడా పెరిగాడు. ఏకసంథాగ్రాహులైన ఇద్దరూ అనతికాలంలోనే విద్యాపారంగతులయ్యారు.

ఒకనాడు తల్లి ద్వారా తన తండ్రి పరిస్థితి తెలుసుకున్న అష్టావక్రుడు– శ్వేతకేతుడితో కలసి జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. బాలకులైన వారిద్దరినీ ద్వారపాలకులు అడ్డుకున్నారు. ‘జ్ఞానం ఉన్నవాడు బాలుడైనా వృద్ధుడితో సమానం. వయసు మళ్లినవాడు కాదు’ అని అష్టావక్రుడు వారితో వాదించాడు. ద్వారపాలకులు వారిని లోపలకు వెళ్లనిచ్చారు. జనకుడి అనుమతి పొంది, వందితో వాదానికి దిగాడు అష్టావక్రుడు. సుదీర్ఘంగా సాగిన వాదంలో వంది ఓడిపోయాడు. జనక మహారాజు అష్టావక్రుడిని అభినందించి, ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు.

‘మహారాజా! వందితో వాదంలో ఓటమి చెందిన నా తండ్రి జలమజ్జితుడై ఉన్నాడు. అతడిని విడిచిపెట్టు’ అని కోరాడు. జనకుడు జలమజ్జితుడైన ఏకపాదుడిని బయటకు రప్పించాడు. అష్టావక్రుడిని, ఏకపాదుడిని పూజించి, వారి వద్ద అద్వైత రహస్యాలను తెలుసుకున్నాడు. కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి, వారిని సాదరంగా సాగనంపాడు.
అష్టావక్రుడి పితృభక్తికి సంతుష్టుడైన ఏకపాదుడు, ‘కుమారా! నీ అంగవైకల్యానికి కారకుడను నేనే. నీ పితృభక్తికి సంతోషించాను. నువ్వు వెంటనే వెళ్లి సమంగ నదిలో స్నానం చేసి రా’ అని ఆదేశించాడు. అష్టావక్రుడు సమంగ నదిలో ముమ్మారు మునిగి స్నానం చేశాడు. అతడి శరీరంలోని వంకరలన్నీ పోయి, సుందరాకారం వచ్చింది. తండ్రి తపోమహిమకు అష్టావక్రుడు చకితుడయ్యాడు. ఇంటికి చేరుకున్నాక తల్లిదండ్రులను పూజిస్తూ, ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ వచ్చాడు. - సాంఖ్యాయన

పురావిశేషం..
మధ్యప్రదేశ్‌లోని సిహోనియా పట్టణంలో ఉన్న ఈ పురాతన శివాలయం దాదాపు వెయ్యేళ్ల నాటిది. కచ్ఛపఘట వంశానికి చెందిన కీర్తిరాజ హయాంలో క్రీస్తుశకం 1015–1035 నడుమ ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్రకారుల అంచనా. ఇదివరకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు సూరజ్‌పాల్‌ భార్య రాణి కకనావతి పేరుమీద దీనికి ‘కకన్‌ మఠ్‌’ అనే పేరువచ్చిందని చెబుతారు. ఈ ఆలయాన్ని పరమశివుని భూతగణాలు రాత్రికి రాత్రే నిర్మించినట్లు స్థలపురాణ గాథ ప్రచారంలో ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement