మూడో పంటగా సౌర విద్యుత్తు! | Solar power as the third crop | Sakshi
Sakshi News home page

మూడో పంటగా సౌర విద్యుత్తు!

Apr 29 2025 6:45 AM | Updated on Apr 29 2025 6:45 AM

Solar power as the third crop

సౌర విద్యుత్తు ప్యానళ్ల మధ్యలో, నీడలో పంటల సాగు
దేశంలో అనేక చోట్ల ప్రయోగాత్మకంగా సాగు

మెట్ట భూముల్లో సోలార్‌ ప్యానెళ్లను నేలపైనే ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయటం తెలిసిందే. అయితే, వ్యవసాయ భూమిని ఇలా సోలార్‌ ప్యానళ్ల మయం చేస్తూ పోతే సాగు విస్తీర్ణం తగ్గిపోతుందన్న భయాందోళనలు లేకపోలేదు. అందుకే, పంటలను సాగు చేస్తూ అదే పొలంలోనే సోలార్‌ ప్యానళ్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మేలు కదా! 

ప్యానళ్ల ఏర్పాటులో కొన్ని మార్పులు చేసుకుంటే పొలాల్లో పంటలతో పాటు పనిలో పనిగా సౌర విద్యుత్తును కూడా నిక్షేపంగా పండించుకోవచ్చని విదేశీ అనుభవాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఇది సరికొత్త ట్రెండ్‌. అదే ‘అగ్రివొల్టాయిక్స్‌’! ఏడాదికి రెండు (ఖరీఫ్, రబీ) పంటలతో పాటే అదే పొలంలో మూడో పంటగా సౌర విద్యుత్తు ఉత్పత్తిపై మన దేశంలోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల పైలట్‌ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఆ సంగతులేమిటో చూద్దాం..!

సోలార్‌ ప్యానళ్ల పక్కన పంటలు
నేలకు ఒకటి, రెండు అడుగుల ఎత్తులో గ్రౌండ్‌ మౌంటెడ్‌ సోలార్‌ ప్యానళ్లను వరుసలుగా ఏర్పాటు చేసుకొని, ఆ వరుసల మధ్యలో ఎక్కువ దూరం ఉండేలా చూసుకొని.. ఆ ఖాళీలో పంటలను పండిస్తున్న సంస్థలు ఉన్నాయి. కేరళలోని కొచ్చిన్‌ విమానాశ్రయంలో, గుజరాత్‌లోని సర్దోయ్‌లో కూడా ఇలాంటి ప్రయోగాత్మక సోలార్‌లో అంతర సాగు జరుగుతోంది. ప్యానళ్ల వరుసల మధ్యలో గోరింటాకు మొక్కలు సాగు చేస్తున్నారు. బలమైన గాలుల నుంచి సోలార్‌ ప్యానళ్లను రక్షించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగంగా ఉన్నాయంటున్నారు. ప్యానళ్లను కడిగే నీటిని ఈ మొక్కలకు మళ్లిస్తూ నీటిని పునర్వినియోగిస్తున్నారు.

ప్యానళ్ల నీడలో పంటలు
మహారాష్ట్రలోని పర్బనిలో 5 ఎకరాల్లో ఒక మోస్తరు ఎత్తున ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానళ్ల కింద తక్కువ ఎత్తు పెరిగే అల్లం, పసుపు, పెసలు, బెండ వంటి పంటలు పండిస్తున్నారు. 50 మెగావాట్ల ప్రాజెక్టును సన్‌సీడ్‌ ఎపివి, కనొడా ఎనర్జీ, జిఐజడ్‌ జెర్మన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉమ్మడిగా నెలకొల్పాయి. ‘సోలార్‌ ప్యానళ్ల కింద మేం పెట్టిన పంటలు బాగానే పెరుగుతున్నాయి. మామూలు పొలాల్లో సమానంగానే దిగుబడి వస్తోంది. అయితే, చెరకు వంటి బాగా ఎత్తుగా పెరిగే పంటలను సోలార్‌ ప్యానళ్ల కింద పెంచలేం’ అన్నారు ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న యువ రైతు గోవింద్‌ రసవె.

ద్రాక్ష తోట కూడా,.
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న దేశంలోనే అతి పెద్ద రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పిఓ) సహ్యాద్రి ఫామ్స్‌ కూడా ప్రయోగాత్మకంగా సోలార్‌ సేద్యం చేస్తోంది. ఒక ఎకరంలో సోలార్‌ ప్యానళ్లను 3.75 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేసి, వాటి నీడన రకరకాల పంటలను సాగు చేస్తోంది. 250 కె.డబ్ల్యూ. సామర్థ్యంతో కూడిన బై–ఫేసియల్‌ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్యానళ్ల కింద ద్రాక్ష తోటలు పెంచుతున్నారు. ప్రత్యేకంగా పందిళ్లు వేయాల్సిన అవసరం లేకుండా ప్యానళ్ల కోసం ఏర్పాటు చేసే ఫ్రేమ్‌లకే ద్రాక్ష తీగలను పాకించవచ్చు. కీర, టొమాటో వంటి పంటలకు కూడా ప్రత్యేకంగా స్టేకింగ్‌ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఖర్చు తగ్గుతుందని సహ్యాద్రి ఫామ్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ షెల్కె చెప్పారు.

బెండ, సొర, కొత్తిమీర..
రాజస్థాన్‌లోని జో«ద్‌పుర్‌లో కేంద్రీయ మెట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధనా సంస్థలో, గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లాలోనూ 3 మీటర్ల ఎత్తున పెట్టిన సోలార్‌ ప్యానళ్ల నీడన బెండ, సొర, కొత్తిమీర, గోరుచిక్కుడు పండిస్తున్నారు. శీతాకాలంలో టొమాటోలు, కీరదోస, జుకిని, మిరప పంటలు పండిస్తున్నారు. మరో పద్ధతి ఏమిటంటే.. సోలార్‌ ప్యానళ్లను బల్లపరుపుగా కాకుండా, నిట్ట నిలువుగా ఏర్పాటు చేసి, వాటి మధ్యలో ధాన్యపు పంటలు పండించుకోవటం. మహారాష్ట్రలో ఇటువంటి వర్టికల్‌ బైఫేషియల్‌ సోలార్‌ అగ్రివొట్లాయిక్స్‌ ప్రాజెక్టును నెక్ట్స్‌2సన్, వాట్‌కార్ట్‌ సంస్థలు నెలకొల్పాయి. ఇలా 90% భూమిలో పంటలు పండించుకోవచ్చు. పది శాతం నేల మాత్రమే సోలార్‌ ప్యానళ్లకు సరిపోతుంది.

ప్యానళ్ల కింద పశువుల పెంపకం
మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్తు దొరకదు. సోలార్‌ ప్యానళ్ల కింద పంటలు పండించుకుంటే, విద్యుత్తు సమస్య తీరుతుంది, పంటలపై కూడా ఆదాయం వస్తుంది. ఆ విధంగా రైతులకు అగ్రివోల్టాయిక్స్‌ ద్వారా అనేక ప్రయోజనాలు నెరవేరుతాయని మహేశ్‌ సంతృప్తిగా చెప్పారు. ఎలివేటెడ్‌ సోలార్‌ ప్యానళ్ల కింద పంటలనేæ పండించాలనేం లేదు, పశువులను కూడా పెంచుకోవచ్చు. ఢిల్లీ పరిసరాల్లో 2.5 ఎం.డబ్ల్యూ. సామర్థ్యం గల ఎలివేటెడ్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, అందులో పశువులను మేపితే మంచి ఆదాయం వచ్చిందని రుజువైందని ఆయన అన్నారు.

రైతులకు రిస్క్‌ లేదు
సన్‌సీడ్‌ ఎపివి సంస్థ అధిపతి వివేక్‌ సరఫ్‌ మాట్లాడుతూ ‘ఈ అగ్రివొల్టాయిక్స్‌ ప్రాజెక్టులో రైతులకు ఎటువంటి రిస్క్‌ లేదు. పెట్టుబడి మాది. పెట్టుబడి రిస్క్‌ మాకే ఉంటుంది. భూములు కౌలుకు ఇచ్చిన రైతులకు రిస్క్‌ ఏమీ లేదు. సాధారణ పంటలు సాగు చేస్తే రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 50 వేల వరకు వస్తాయి. అగ్రివొల్టాయిక్స్‌కు ఇస్తే ఆ పంట దిగుబడులతో పాటు కౌలు రూ. 50 వేల వరకు అదనపు ఆదాయం వస్తుంది.

 ఈ వ్యవసాయ పనులు చేసే రైతులకు ఇంకా అదనపు ఆదాయం కూడా వస్తుంది’ అన్నారు. అయితే, విడిగా రైతులు దీర్ఘకాలిక కౌలుకు ఇవ్వాలంటే వెనుకాడతారు. రైతులు బృందంగా, ఎఫ్‌పిఓగా ఏర్పాడితే అప్పుడు ఆ సంకోచం ఉండదు అన్నారాయన. సౌరవిద్యుత్తు ఉత్పత్తితో పాటు పంటల సాగులో వున్న సమస్యలు మున్ముందు తీరిపోతాయి. రైతులకు ఏటా రెండు పంటలతో పాటు సౌర విద్యుత్తును మూడో పంటగా పండించుకోవటం సులభ సాధ్యమవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశిద్దాం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement