నాయకుడు ఎలా ఉండాలంటే..? | Shataka Neethi: Devotional And Spiritual Story On Qualities Of A Leader | Sakshi
Sakshi News home page

నాయకుడు ఎలా ఉండాలంటే..?

Aug 6 2026 2:01 AM | Updated on Aug 6 2026 2:01 AM

Shataka Neethi: Devotional And Spiritual Story On Qualities Of A Leader

సన్నిధి

శతక నీతి: నాయకుడి లక్షణాలు

రామాయణంలో వాల్మీకి రాజు ఏమి చెయ్యాలో చెప్పాడు.
‘ప్రజాసుఖే సుఖం రాజ్ఞా ప్రజానాం చ హితే హిత
నాత్మప్రియం హితం రాజ్ఞాప్రజానం తు ప్రియం’... 
ఎంతో చక్కటి భావన.. రాజు తనకిష్టమైనది కాదు ప్రజలకిష్టమైనది చెయ్యాలి. మహాభారతంలో భీష్ముడు చెప్పిన పది ముఖ్య లక్షణాలు నేటి ఆధునిక పాఠ్య పుస్తకాలలో ప్రధానాంశాలుగా చోటు చేసుకున్నాయంటే అతిశయోక్తి లేదు.

నాయకుడు/రాజు ఎలా ఉండాలి అనే విషయంలో 
మన నీతి కవులు చెప్పిన ముఖ్యమైన పద్యాలు ఇవే:
రాజు, నాయకుడి బాధ్యతను, స్థానబలాన్ని నొక్కి చెప్పాడు వేమన.

చేకొనుచును తనకు జేరి సాగినంతలో
జెడిన ప్రజల రక్షసేయకున్న
తనదుసాగుటేమి తనతనువదియేమి
విశ్వదాభిరామ వినుర వేమ
భావం: తనను నమ్మి ఆశ్రయించిన ప్రజలను, చెడిపోయిన సమయంలో రక్షించని నాయకుడి అధికారం, జీవితం వ్యర్థం. ప్రజా రక్షణే నిజమైన నాయకత్వం.

మరొకటి – శత్రువు పట్ల కూడా ఔదార్యం ఉండాలి..

చంపదగిన యట్టి శత్రువు తన చేత
జిక్కెనేని కీడు సేయ రాదు
పొసగ మేలు జేసి పొమ్మనుటే చాలు!
విశ్వదాభిరామ వినర వేమ
భావం: నాయకుడు క్షమాగుణం కలిగి ఉండాలి. చేతిలో చిక్కిన శత్రువును కూడా క్షమించి మేలు చేసి పంపాలి.
దీనికి ఒక మంచి ఉదాహరణ.. పురుషోత్తముడనే రాజు యుద్ధం లో అలెగ్జాండర్‌ను క్షమించి వదిలి వేయుట.

బద్దెన రాజు/నాయకుడి ధర్మం, ప్రజాపాలన గురించి చాలా స్పష్టంగా చెప్పాడు.

రాజు హద్దు దాటితే:
నరపతులు మేఱ దప్పిన,
దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,
గరణము వైదికుడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!
భావం: రాజు ధర్మం తప్పి ప్రవర్తిస్తే, విధవ ఇంట పెత్తనం చేసినా, వైదికుడు కరణం చేసినా – అవి ప్రాణాంతకం అవుతాయి తప్ప మంచిది కాదు. నాయకుడు ధర్మం తప్పకూడదు.

మంచి రాజు లక్షణం ఏమిటంటే
దగ్గర కొండెము సెప్పెడు పెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై
మరిత నెగ్గు ప్రజ కాచరించు బగ్గులకై కల్పతరువు బోదచుట సుమతీ
కొండెగాళ్ల మాటలు విని ప్రజలకు అన్యాయం చేసే రాజు, బొగ్గుల కోసం కల్పతరువును నరికినంత తెలివితక్కువవాడు. నాయకుడు నిజానిజాలు పరిశీలించాలి.

మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్‌
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
ఒక రాజ్యం/కోటకు బలమైన సైన్యమే ప్రాణం. నాయకుడు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇక భర్తృహరి ఏమి చెప్పాడంటే... 
శ్లోకం: విపది ధైర్యమథాభ్యుదయే క్షమా
సదసి వాక్పటుతా యుధి విక్రమః ’
యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ
ప్రకృతిసిద్ధమిదం హి మహాత్మానామ్‌’
భావం: ‘కష్టాల్లో ధైర్యంగా ఉండటం, విజయ సమయంలో క్షమ కలిగి ఉండటం, సభలో వాక్పటిమ, యుద్ధంలో పరాక్రమం, కీర్తిపై ఆసక్తి, శాస్త్రశ్రవణంలో వ్యసనం – ఇవన్నీ మహనీయులైన నాయకుల సహజ గుణాలు.

మరొక ముఖ్యమైన భావం
‘ప్రజలను పశువుల వత్సంలా ప్రేమగా పోషిస్తే, భూమి కల్పలతలా అనేక ఫలితాలను ఇస్తుంది‘. ఇది కేవలం రాజులకే కాదు, నాయకత్వం వహించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
భాస్కర శతకంలో నేరుగా ‘నాయకుడు అనే పద్యం ప్రసిద్ధంగా లభించలేదు. కానీ భాస్కరుడు కూడా నీతి, ధర్మం, వినయం గురించి చెప్పాడు.

నాయకుడు అహంకారం లేకుండా, విద్యావంతుడై, దానగుణం కలిగి, ప్రజాహితం కోసం పనిచేయాలి. ‘అధికారం వచ్చినా వినయంగా ఉండాలి‘ అనేది భాస్కరుడి ప్రధాన సందేశం.
దేశానికి రాజు కాని, సంస్థకి అధిపతి కాని ఎన్నో సమస్యలను ఎదుర్కొని అడుగు వెయ్యాలి... బాహ్య పరిస్థితి.. లోలోపల పరిస్థితి... అన్నింటిని మించి అనిశ్చిత వాతవరణంలో దేశ భద్రత, ప్రజల సంక్షేమం, బాగోగులు, ఆర్థికంగా నిలబడ్డం... ఇలా ఎన్నో సవాళ్ళు.. ప్రజాఅభిమానాన్ని చూరగోనె ప్రయత్నం.. సత్సంబంధాలు తో బాటు సజావుగా సాఫీగా ఉండాలి పరిపాలన... ఎన్నో మంచి అలవాట్లతో నీతిగా అందించాలి పరిపాలన. అందుకు మంచి నాయకుడు కావాలి. ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలతో నడుం కట్టి అడుగు ముందుకెయ్యాలి.
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement