కేన్సర్‌ను అరికట్టే ఔషధాహారం! | Sagubadi: Anti-cancer medicinal properties identified in 3 rice varieties | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ను అరికట్టే ఔషధాహారం!

Jun 6 2025 4:35 AM | Updated on Jun 6 2025 4:35 AM

Sagubadi: Anti-cancer medicinal properties identified in 3 rice varieties

కేతన్‌ హితం, కింటుమాన్, బాలాటినో

ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఆవిష్కరణ

3 వరి రకాల్లో యాంటీ కేన్సర్‌ ఔషధ గుణాల గుర్తింపు

ఈ బియ్యం తవుడుతో చేసే ఆహారమే ఔషధం

‘కేన్సర్‌ నిరోధక సాంబమసూరి’ రూపకల్పనకు పరిశోధనలు

భవిష్యత్తులో తక్కువ ఖర్చుతోనే కేన్సర్‌కు చికిత్స

‘సాక్షి’తో ‘ఇరి’ పరిశోధకులు డా. నెసె శ్రీనివాసులు

సాక్షి, సాగుబడి: భవిష్యత్తులో కేన్సర్‌ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని రకాల బియ్యం లేదా బియ్యం తవుడుతో చేసే ఆహారాన్ని సూచించవచ్చు. అవి తింటే కేన్సర్‌ రాకపోవచ్చు, వచ్చినా తగ్గిపోవచ్చు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే కేన్సర్‌ను అరికట్టేయవచ్చు. ఆశ్చర్యంగా అనిపిస్తున్న దీన్ని సుసాధ్యం చేస్తోంది ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి). 3 రకాల ఊదా, ఎరుపు రంగు వరి బియ్యంపై పొర(తవుడు)లో కేన్సర్లను అరికట్టే ఔషధ పదార్థాన్ని వెలికితీసి, ఔషధాహారాన్ని విజయవంతంగా రూపొందించారు అక్కడి శాస్త్రవేత్తలు. కొలొరెక్టల్‌ కేన్సర్‌ (పెద్దపేగు+గుదద్వారం కేన్సర్‌), రొమ్ము కేన్సర్‌లను అరికట్టడానికి ఈ ఫుడ్‌ సప్లిమెంట్‌ దోహదపడుతుంది.

కేన్సర్‌ కణాలపై దీని పనితీరును ‘ఇరి’ ప్రయోగశాలలో పరీక్షించి అద్భుత ఫలితాలు సాధించారు. ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు సారథ్యం వహిస్తున్న ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, తెలుగువారైన డాక్టర్‌ నెసె శ్రీనివాసులు ఈ విశేషాలను టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో ‘సాక్షి’కి వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెనుముప్పుగా పరిణమించిన కేన్సర్‌ మహమ్మారికి ముకుతాడు వేసే అద్భుత ‘ఔషధాహారం’ అందుబాటులోకి రానుంది. పురాతన వరి వంగడాల్లో కేన్సర్లను అరికట్టే అద్భుత ఔషధ గుణాలున్నట్లు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించింది ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నెసె శ్రీనివాసులు. ప్రస్తుతం ఈయన ఇరిలో కంజ్యూమర్‌ డ్రివెన్‌ గ్రెయిన్‌ క్వాలిటీ – న్యూట్రిషన్‌ సెంటర్‌ అధిపతిగా ఉన్నారు. ఈయన తల్లిది అనంతపురం. ఈయన  పెరిగింది కర్ణాటకలో.

3 రకాల పురాతన వరి రకాలతో..
ప్రపంచవ్యాప్తంగా 1,32,000 పురాతన వరి వంగడాలున్నాయి. వీటిలో చాలా వరకు తెల్లబియ్యం రకాలే. రకరకాల రంగుల బియ్యం రకాలు 800. వీటిలో పోషకాలపై జరిపిన పరిశోధనల్లో 6 రకాల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ కేన్సర్‌ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు ‘ఇరి’ గుర్తించింది. ప్రస్తుత పరిశోధనలో 3 రకాలను శాస్త్రవేత్తలు వాడారు. ఫిలిప్పీన్స్ కు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగు గల ‘బాలాటినో’ రకం బియ్యం, ‘కింటుమాన్‌’ అనే ఎర్ర బియ్యంతో పాటు ఇండోనేíసియాకు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగుండే కేతన్‌ హితం’ అనే పురాతన రకాలను వాడారు. ఈ బియ్యపు తవుడులోని ఔషధ విలువలున్న పదార్థాన్ని ఉపయోగించి కేన్సర్‌ను అరికట్టే ఫుడ్‌ సప్లిమెంట్‌ను తయారు చేశారు. ఇది పొడి లేదా ద్రవ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

ఒక్క గ్రాము చాలు!
300 గ్రాముల బియ్యం నుంచి తీసిన తవుడుతో 1 కిలో ఫుడ్‌ సప్లిమెంట్‌ను ఉత్పత్తి చేయవచ్చు. కేన్సర్‌ నిరోధక లక్షణాన్ని మనిషి దేహంలో కలిగించడానికి కనీసం 1 గ్రాము సరిపోతుందని డా.శ్రీనివాసులు తెలిపారు. కేన్సర్‌ రోగుల కణాలపై ప్రయోగశాలలో ఈ ఔషధాహారంతో నిర్వహించిన పరీక్షల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ రెండు రకాల కేన్సర్‌ రోగులకు ఇస్తున్న కీమోథెరపీ ఔషధం ‘డోక్సోరుబిసిన్‌’తో సరిసమానమైన ఫలితాలను.. ఈ ఫుడ్‌ సప్లిమెంట్‌ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో దీన్ని ఎలుకలపైన, ఆ తర్వాత కేన్సర్‌ రోగులపైన ప్రయోగించబోతున్నామని వెల్లడించారు.

సాంబమసూరిలోకి ఈ జన్యువులు
ఈ 3 రకాల పురాతన వరి వంగడాల్లోని కేన్సర్‌ నిరోధక ఔషధ గుణాలకు కారణమైన జన్యువులు ఏవో గుర్తించేందుకు ‘ఇరి’లో పరిశోధన కొనసాగుతోంది. ‘ఈ పరిశోధన పూర్తయ్యాక అధిక దిగుబడినిచ్చే మన సాంబమసూరి వరి వంగడంలోకి ఈ ఔషధ గుణాలున్న జన్యువులను జన్యు సవరణ ప్రక్రియ ద్వారా జోడిస్తాం. ఆ సరికొత్త సాంబమసూరి ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తినొచ్చు.

ఫుడ్‌ సప్లిమెంట్‌ తింటే వంద శాతం ఫలితం ఉంటుంది. వండిన అన్నం తింటే.. అందులోని కేన్సర్‌ నిరోధక ఔషధ గుణం 70% వరకు వంటపడుతుంది. కేన్సర్‌ కణాలు క్రమంగా కోలుకొని సాధారణ స్థితికి వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎలాంటి హానీ జరగదని కూడా మా ప్రయోగశాలలో రూఢీ అయ్యింది. ఇది స్వల్ప ఖర్చుతో కేన్సర్‌ను అరికట్టే మార్గంగా ప్రపంచం ముందుకు వస్తోంది’ అని డా. శ్రీనివాసులు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement