మన దేశమంతటా వేడుకగా జరుపుకొనే పండుగల్లో రాఖీ పండుగ విశిష్టమైనది. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా ‘రక్షాబంధనం’ తరతరాల ఆనవాయితీగా వస్తోంది. ఏటా శ్రావణ పూర్ణిమ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. సోదరుల నుంచి కానుకలు అందుకుంటారు. రాఖీ పండుగ మొదలవడానికి దాదాపు నెల్లాళ్ల నుంచి మార్కెట్లో రాఖీ కళ కనిపిస్తుంది.
రాఖీ పండుగ కోసం సీజనల్గా ఊరూరా రాఖీ దుకాణాలు వెలుస్తాయి. స్వీట్ షాపుల్లో అమ్మకాల జోరు విపరీతంగా పెరుగుతుంది. రాఖీ సీజన్లో దేశవ్యాప్తంగా జరిగే రాఖీల అమ్మకాల విలువ దాదాపు రూ.17,000 కోట్లకు పైగా ఉంటుందని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్’ (సీఏఐటీ) చెబుతోంది. గత ఏడాది రాఖీ మార్కెట్లో 42 శాతం వృద్ధి నమోదైంది. ఈసారి కూడా రాఖీల అమ్మకాల విలువ మరో 40 శాతానికి పైగా పెరగవచ్చని సీఏఐటీ అంచనా. రాఖీ జోరు గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...
మన దేశంలో రాఖీల తయారీ సంఘటిత రంగంలో కంటే అసంఘటిత రంగంలోనే ఎక్కువగా జరుగుతుంది. సంఘటిత రంగానికి సంబంధించిన లెక్కలు మాత్రమే పారిశ్రామిక సమాఖ్యలకు, ఇతర సంస్థలకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూపిన అంకెల కంటే వాస్తవానికి రాఖీల తయారీ, విక్రయాలు మరింత ఎక్కువగానే జరుగుతుంటాయి.


