ఆప‌న్న హ‌స్తం ఆదుకుంది.. చ‌దువు దారి చూపింది! | Rajasthan girl shines in Telangana Inter Results | Sakshi
Sakshi News home page

Hyderabad: నగరంలో మెరిసిన ఎడారి ప్రాంతపు బాలిక

Apr 24 2025 7:27 PM | Updated on Apr 24 2025 7:40 PM

రవీనా చౌదరికి స్వీట్‌ తినిపిస్తున్న టీఎన్‌జీవోస్‌ మాజీ నేత కోయడ దశరథరావు

రవీనా చౌదరికి స్వీట్‌ తినిపిస్తున్న టీఎన్‌జీవోస్‌ మాజీ నేత కోయడ దశరథరావు

కన్నవాళ్లు, అయినవాళ్లు చదువును అడ్డుకున్నా ఇంటర్‌లో 978 మార్కులు సాధించిన వైనం 

చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ ఇంటర్మీడియెట్‌ పూర్తి 

చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్, టీఎన్‌జీవోస్‌ మాజీ నేత చేయూత 

హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగించిన రాజస్థాన్‌ అమ్మాయి

భవిష్యత్తులో సివిల్స్‌ సాధించడమే లక్ష్యం అంటున్న రవీనా చౌదరి

కన్నవారు కాదనుకున్నా.. అనాథలా మారినా.. కష్టాలు చుట్టుముట్టినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అక్షరమే ఆయుధంగా బతుకుపోరు సాగించింది.. అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ తాజాగా ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో మెరిసింది రవీనా చౌదరి. రెండేళ్ల పసిప్రాయంలో ఆమెను తల్లి వదిలేసి ఎటో వెళ్లిపోయింది. ఆలనా పాలనా చూడలేక తండ్రి మొహం చాటేశాడు. ఏ దారి లేని ఏడారి రాష్ట్రానికి చెందిన ఆ చిన్నారిని తీసుకొని నానమ్మ హైదరాబాద్‌ (Hyderabad) వచ్చింది. ఇక్కడే ఉంటున్న తన కూతురు వద్ద ఉంచి రాజస్థాన్‌ తిరిగి వెళ్లిపోయింది. రవీనాను మేనత్త చేరదీసి స్థానిక హెచ్‌ఎంటీ కాలనీలోని సెయింట్‌ ఆంథోని పాఠశాలలో ఎల్‌కేజీలో చేర్పించింది. చదువుల్లో చురుగ్గా ఉండే రవీనా పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది.  

చదువు ఇక చాలన్నారు..
పదవ తరగతి పూర్తి కాగానే పైచదువులు చదివించలేనని, ఏదైనా పని చేయాలని రవీనాకు మేనత్త చెప్పింది. తండ్రి రాజస్థాన్‌ (Rajasthan) నుంచి వచ్చి తీసుకువెళ్లి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాడు. చదువుకుంటానంటే కొట్టి పెళ్లికి అంగీకరించాలని హింసించాడు. తండ్రి బారి నుంచి తప్పించుకొని రవీనా అతి కష్టం మీద తిరిగి నగరానికి వచ్చేసింది. అయితే ఆమెను మేనత్త చేరదీయలేదు.  

ఓనమాలు నేర్పిన పాఠశాల గడప తొక్కడంతో..
రవీనా చౌదరి సెయింట్‌ ఆంథోని పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుంది. ఆయన చలించి పాఠశాల పూర్వ విద్యార్థులు, తెలిసిన వారి సహకారంతో సమీపంలోని గరల్స్‌ హాస్టల్‌లో ఆమెను చేర్పించారు. నెలనెలా ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పుకోవాలని ఐదుగురు చిన్నారులను అప్పగించారు. దీంతో రవీనా చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ హబ్సిగూడలోని ఓ ప్రైవేటు ఇంటర్‌ కళాశాలలో చేరింది. ఆమె గాథ‌ టీఎన్‌జీఓ (TNGO) వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి కోయడ దశరథరావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు.

తాజాగా వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో రవీనా 978/1000 మార్కులు సాధించి చదువుపట్ల తన ధృడత్వాన్ని చాటుకుంది. డిగ్రీ పూర్తి చేసి ఎప్పటికైనా సివిల్స్‌లో ర్యాంకు తెచ్చుకోవడమే తన లక్ష్యమని రవీనా చౌదరి ధీమాగా చెబుతోంది. అలాగే ఆమె వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రవేశం పొంది ఓ టోర్నమెంటులో మెడల్‌ కూడా సాధించడం గమనార్హం. రవీనా డిగ్రీ చదువుకు, ఆ తర్వాత సివిల్స్‌ ప్రిపరేషన్‌కు అండగా ఉంటామని పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్, దశరథరావు పేర్కొనడం వారి గొప్ప మనసుకు నిదర్శనం.

చ‌ద‌వండి: ఈసారి కూడా అమ్మాయిల‌దే హ‌వా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement