ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూ.ఎం.ఓ.) తాజా హెచ్చరికల ప్రకారం ఎల్ నినో ప్రభావం బలంగా ఏర్పడి కొనసాగుతోంది. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే తీవ్రమైన ఎండలు, వర్షాభావం వ్యవసాయంతో పాటు పశుసంపద ఉత్పత్తికి పెను సవాలుగా మారుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తాగునీటి ఎద్దడి, పచ్చిమేత కొరత, దాణా ధరల పెరుగుదల వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతిని పాలు, మాంసం, గుడ్ల ఉత్పాదకత పడిపోయే ప్రమాదం ఉంది.
తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సుమారు 42.33 లక్షల ఆవులు, 42.26 లక్షల గేదెలు, 1.91 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, దాదాపు 8 కోట్ల కోళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎండ తీవ్రతకు పశువుల శరీర ఉష్ణోగ్రత, శ్వాస రేటు, నీటి అవసరం పెరిగి, మేత తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి.
ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందంటే?
పాడి పశువులు: విదేశీ, సంకరజాతి ఆవులు 24–27 డిగ్రీల సెల్సియస్, దేశీ ఆవులు 33 డిగ్రీలు, గేదెలు 36 డిగ్రీల ఉష్ణోగ్రత మించితే వేడి ఒత్తిడికి గురవుతాయి. శరీరాన్ని చల్లబరచుకోవటానికే చాలా శక్తి ఖర్చయి పోతుంది. మేత తినటం తగ్గడంతో పాల దిగుబడితో పాటు పాలలో వెన్న, ప్రొటీన్ శాతం తగ్గి రైతులకు గిట్టుబాటు ధర రాదు.
గొర్రెలు, మేకలు, పందులు: పచ్చిక బయళ్ల కొరతతో జీవాల బరువు పెరగటం మందగించి, మార్కెట్ బరువు సాధించటానికి ఎక్కువ సమయం పడుతుంది. అధిక వేడి తట్టుకోలేని పందుల్లో ఎదుగుదల, పునరుత్పత్తి క్షీణిస్తుంది.
పౌల్ట్రీ – ఆక్వా: దేశ గుడ్ల ఉత్పత్తిలో 13% వాటా ఉన్న తెలంగాణలో కోళ్ల మేత మార్పిడి నిష్పత్తి (ఊఇఖ) పెరిగి, గుడ్ల ఉత్పత్తి, నాణ్యత, పొదిగే సామర్థ్యం తగ్గుతాయి. చేపల చెరువుల్లో నీటిమట్టాలు పడిపోయి నాణ్యత దెబ్బతింటుంది.
పునరుత్పత్తి – వ్యాధులు: వేడి తీవ్రత వల్ల పశువుల్లో ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించవు. చూడి నిలిచే సామర్థ్యం తగ్గి, ఈతల మధ్య కాలం పెరుగుతుంది. మగ పశువుల్లో వీర్యం నాణ్యత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గి పొదుగు వాపు, గాలికుంటు, పీపీఆర్, కొక్కెర వంటి వ్యాధులు ప్రబలే
ప్రమాదం ఉంది.
ఉత్తమ యాజమాన్యం ఎలాగంటే..?
పాకల నిర్వహణ: పాకల చుట్టూ గోనె సంచులు కట్టి రోజుకు 2–3 సార్లు తడపాలి. పైకప్పుపై కూలింగ్ పెయింట్ వేయడం ద్వారా 95% ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. పైకప్పుపై గడ్డి లేదా కొబ్బరి/తాటి ఆకులు పరవాలి. షెడ్లలో స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు, చుట్టూ 20% షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలి.
మేత – పోషణ యాజమాన్యం: సాధారణంగానే దాణా, మేత కొరత ఉన్నందున ముందస్తుగా ‘సైలేజ్’ (పాతర గడ్డి) రూపంలో నిల్వ చేసుకోవాలి. గ్రామీణ గడ్డి బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. పశుగ్రాసాన్ని చాఫ్ కట్టర్తో చిన్న ముక్కలుగా కత్తిరించి వృథాను అరికట్టాలి. పీచు మేతలను తగ్గించి, ఉదయం–సాయంత్రం వేళల్లోనే మేపాలి. జీవాలను ఉదయం 6–11 గంటల మధ్య, సాయంత్రం 4–6 గంటల మధ్యలోనే మేతకు పంపాలి.
గడ్డి రకాలు – సూక్ష్మ పోషకాలు: కరువును తట్టుకునే తెలంగాణ ఫాడర్ బజ్రా (టీఎస్ఎఫ్బీ 15–4, 15–8, మోతి బజ్రా), తెలంగాణ జొన్న (సీఎస్వీ–41), హెడ్జ్ లూసర్న్ (టీఎస్హెచ్ఎల్–1) వంటి రకాలను సాగు చేయాలి. పాల ఉత్పత్తి తగ్గకుండా పశువైద్య విశ్వవిద్యాలయం రూపొందించిన ఖనిజ లవణ మిశ్రమం (టెల్మిన్)ను రోజుకు 50–100 గ్రాములు, కేజీ దాణాకు 0.5–1 గ్రాము బిటైన్ కలిపి ఇవ్వాలి. టన్ను కోళ్ల దాణాలో 100 గ్రా. విటమిన్–సి, 50 గ్రా. విటమిన్–ఇ వాడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
డాక్టర్ ఎన్. రాజన్న
సీనియర్ ప్రొఫెసర్ పశు ఉత్పత్తి యాజమాన్య విభాగం,
పీవీనరసింహారావు పశు విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్
నిర్వహణ:
పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్


