డయాబెటిస్కు ‘హెచ్బీఏ1సీ’ ఉన్నట్టే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) అనే లంగ్స్ వ్యాధికి ఓ పరీక్ష ఉంటే ఎంత బాగుంటుంది! దాదాపు రూ. 7,000 ఖర్చయ్యే చోట రూ. 100 కే పరీక్ష అందుబాటులోకి వస్తే పేదలకు ఎంత ఉపయోగంగా ఉంటుంది!! ఈ పరీక్ష రూపకల్పన కోసం ఓ పధ్నాలుగేళ్ల చిన్నారి తన ఏఐ పరిజ్ఞానంతో సాంకేతిక సహకారం అందిస్తే ఎంత అబ్బురంగా ఉంటుంది! అలాంటి ఓ కలను సాకారం చేసేందుకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనూరాధ నేతృత్వంలో ‘మేధాంకుర’ సభ్యులు శ్రమించి... ఆ పరీక్షను విజయవంతం చేశారు. దాంతో ఆ సాంకేతికతకు ప్రతిష్ఠాత్మకమైన ‘బీఎంజే డిజటల్ ఇన్నోవేషన్ అవార్డు – సౌత్ ఏషియా–2026’ లభ్యమైంది. ఈ సందర్భంగా తమ సాంకేతికత అందుబాటులోకి వస్తే వ్యాధిగ్రస్తులకూ, పేదలకూ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనే అంశాలను ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ అనూరాధ చెబుతున్నారు. ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే...
→ చక్కెరపాకంలో గులాబ్జామూన్లా...
మా పరీక్ష గురించి చెప్పే ముందు హెచ్బీఏ1సీ గురించి కాస్త వివరిస్తాను. మరీ వైద్యపరమైన అంశాలతో కాకుండా... మామూలు వ్యక్తులకూ అర్థమయ్యే భాషలో చె΄్పాలంటే... మన రక్తకణాలను కాసేపు గులాబ్జామూన్ లనుకుందాం. మన రక్తంలోకి చక్కెర బాగా ఇంకిపోయిన పాకం అనుకుంటే... మూడు నెలల పాటు మన రక్తకణాలు ఆ పాకంలో బాగా నానిపోయాయని భావించవచ్చు. మర్నాడు రక్తపరీక్ష ఉండగా... పేషెంట్ ఆ ముందు రాత్రి ఏమీ తినకుండా పరీక్షకు వెళ్తే రక్తంలో చక్కెర మోతాదులు తక్కువగా కనిపించవచ్చు. కానీ మూణ్ణెల్ల పాటు రక్తకణాలు బాగా నానిపోయి ఉన్నాయనుకోండి. ఆ విలువలను మాయ చేయడం కష్టం కదా. డయాబెటిస్కు అందుబాటులో ఉన్న ఈ పరీక్ష తరహాలోనే ఊపిరితిత్తుల వ్యాధి అయిన ‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్’ (సీవోపీడీ)కి కూడా ఉంటే పేషెంట్స్కు ఉపయోగకరంగా ఉంటుందని రూపొందించిందే ఈ పరీక్ష.
→ శ్వాసకు అడ్డంకి కల్పించే సీవోపీడీ...
‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిజీస్’ (సీవోపీడీ) అనేది లంగ్స్కు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. వాయు కాలుష్యం, పొగతాగే అలవాటు, మహిళలు వంట పొగకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుండటం, దుమ్ము, రసాయనాల ప్రభావంతో ఈ సమస్య తలెత్తుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలిక దగ్గు, కఫం, ఆయాసం, ఛాతీలో బిగుతు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సుదీర్ఘకాలంలో ఊపిరితిత్తులు తమ ఎలాస్టిసిటీని కోల్పోతూ ఉండటం వల్ల ఊపిరితీసుకోవడం కష్టంగా మారుతుంది.
→ వ్యాధి తీవ్రత తెలుసుకోవడమిలా...
ప్రస్తుతం సీఓపీడీ పేషెంట్స్ లంగ్స్ పనితీరును ప్రధానంగా ‘స్పైరోమెట్రీ’ పరీక్షతో అంచనా వేస్తున్నారు. అయితే సీవోపీడీకి సంబంధించి పేషెంట్ ఆసుపత్రికి వచ్చిన రోజున అతడి పరిస్థితి ఎలా ఉందన్నదే ఈ పరీక్షతో తెలుస్తుంది. ఈ పరీక్షను రెండు నెలల వ్యవధిలో చేశామనుకోండి. అప్పుడు ఆ రెండు నెలల మధ్యనున్న కాలంలో వ్యాధి తీవ్రతల్లో వచ్చిన మార్పులను గుర్తించడం కష్టమవుతుంది. దాంతో కొందరిలో వ్యాధి ముదురుతున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించే ముప్పుండగా, మరికొందరికి అవసరానికి మించి చికిత్స అందించే అవకాశమూ ఉంది. ఓ ప్యాథాలజిస్ట్ గా నేను సీవోపీడీ వ్యాధి గురించి పరిశోధించగా... నా భర్త, మెడికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ సురేశ్ ఈ మార్కర్లపై పరిశోధన చేశారు. పధ్నాలుగేళ్ల చిన్నారి చక్రిక మా పరిశోధనకు సాంకేతిక, ఏఐ పరిజ్ఞానాన్ని సమకూర్చారు.
→ కేవలం వంద రూపాయలకే...
ఈ వ్యాధికి గురవుతున్నవారిలో 90 శాతానికిపైగా అల్ప, మధ్య ఆదాయ వర్గాలకు చెందినవారే. ఇప్పటికి అందుబాటు లో ఉన్న పరిజ్ఞానంతో రూ. 7,000 వరకు ఖర్చవుతుంది. కానీ మా పరీక్ష అందుబాటులోకి వస్తే రూ.100 ఖర్చుతోనే ఈ పరీక్ష చేయవచ్చు. మా ప్రక్రియ వల్ల గ్రామీణ,ఆరోగ్య కేంద్రాల్లోనూ కూడా నిర్వహిస్తూ... మామూలు పీహెచ్పీలోనూ సీవోపీడీ బాధితులకు వైద్యసేవలు అందించవచ్చు.
ఈ పరిశోధనకు బీఎంజే డిజిటల్ ఇన్నోవేషన్ అవార్డు!
హైదరాబాద్లోని ‘మేధాంకుర’ సంస్థకు ప్రతిష్ఠాత్మకమైన ‘బీఎంజే డిజిటల్ ఇన్నోవేషన్’ అవార్డు లభ్యమైంది. బీఎంజే అనేది మెడికల్ జర్నల్స్లో అత్యంత పురాతనమైన జర్నల్స్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈనెల 5 (శనివారం) నాడు న్యూఢిల్లీలో నిర్వహించిన బీఎంజే అవార్డ్స్–సౌత్ ఏషియా కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో పేషెంట్స్కు అందించే వైద్యసేవలను మరింతగా మెరుగుపరిచిన ప్రాజెక్టులకు దక్షిణాసియా స్థాయిలో ఈ పురస్కారం అందిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేధాంకుర ఆసుపత్రి వైద్యసేవలు, పరిశోధన–అభివృద్ధి, రోగ నిర్ధారణ, ఫార్మసీ, కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వేదికల విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ, వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా మేధాంకుర సంస్థ పనిచేస్తోంది.
– యాసీన్


