
మన దేశం నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ వ్యాపారాలు, ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్లు చేయడం అనేది చాలా కాలంగానే జరుగుతోంది. అయితే మన భారతీయులు అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల మన రెస్టారెంట్స్ మనగలుగుతున్నాయనేది ఇప్పటిదాకా ఉన్న ఒక అంచనా. అంతే తప్ప అమెరికాలోని గొప్ప గొప్ప రెస్టారెంట్స్ను వెనక్కి నెట్టేంత సత్తా మనకు లేదని కూడా అనేకమందిలో ఒక అపోహ ఉండేది. అయితే తొలిసారిగా మన రెస్టారెంట్ సత్తా ఏంటో అమెరికాలో నిరూపణ అయింది.
అమెరికా వేదికగా మరోమారు భారతీయ వంటకాలు అంతర్జాతీయ వేదికపై ఖ్యాతి తెచ్చుకున్నాయి. అక్కడి అన్ని రెస్టారెంట్స్ను వెనక్కు నెట్టి ఒక ఇండియన్ రెస్టారెంట్ తొలిస్థానంలో నిలవడం ఇండియన్ క్యుజిన్లోని వైవిధ్యాన్ని చాటి చెప్పింది.
అక్కడి మీడియా చెప్పిన మాట...
ఇదేదో మనం చెప్పిందో, చెప్పుకుంటోందో కాదండోయ్..ఏకంగా అక్కడి న్యూయార్క్ టైమ్స్ మనకు కట్టబెట్టిన ఘనత. గత ‘‘2024లో న్యూయార్క్ సిటీలో అత్యుత్తమ రెస్టారెంట్లు’’ అనే జాబితాను న్యూయార్క్ టైమ్స్ ఇటీవలే ప్రకటించగా, ఆ జాబితాలో మన రెస్టారెంట్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది తొలిసారిగా ఒక భారతీయ రెస్టారెంట్కు లభించిన అత్యంత అరుదైన గౌరవం కావడం విశేషం.
మసాలా ఆమ్లెట్, చెట్టినాడ్ కుర్మా...
న్యూయార్క్ నగరంలోని "సెమ్మా " అనే దక్షిణ భారతీయ రెస్టారెంట్ ఈ ఘనత దక్కించుకుంది. ఈ రెస్టారెంట్ను తమిళనాడుకు చెందిన వంటకాల నిపుణుడైన షెఫ్ విజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతీయ ప్రాచీన వంటల్ని, గ్రామీణ రుచుల్ని అమెరికాలో ఓ కొత్త స్థాయికి తీసుకెళ్లడమే అతని ప్రత్యేకత . మసాలా ఆమ్లెట్, చెట్టినాడ్ కుర్మా, కొంగునాడు చికెన్ వంటి వంటకాలు ఈ రెస్టారెంట్ అతిధులకు వడ్డిస్తూన్న
అయన ఫుడ్ ఇండస్ట్రీ లో ఆస్కార్ అవార్డ్స్ అంత పేరున్న జేమ్స్ బర్డ్ బెస్ట్ షెఫ్ అవార్డు కూడా అందుకున్నారు.
‘‘సెమ్మా’’ అనే పదానికి తమిళంలో ‘‘అద్భుతం’’ అనే అర్థం వస్తుంది. ఆ పేరుకు తగినట్లుగానే, ఈ రెస్టారెంట్ అమెరికన్లను మాత్రమే కాదు, అన్ని దేశాల నుంచి వచ్చే భోజన ప్రియులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయం ప్రకారం – ఇది కేవలం భోజనం చేసే స్థలం మాత్రమే కాదు, భారతీయ వంటక సంప్రదాయాన్ని అనుభవించే ఒక చిరస్మరణీయ ప్రయాణం. ఈ సందర్భంగా షెఫ్ విజయ్ మాట్లాడుతూ ‘‘అంత గొప్ప అవార్డు అందుకుంటానని అనుకోలేదు.. ఇది మా మాతృభూమి అందించిన వరం, మా నానమ్మల వంటల జ్ఞాపకం. ఈ టాప్ ప్లేస్.. ఇది భారతీయ వంటకాల పట్ల వెల్లడవుతున్న ఆసక్తిని, గౌరవాన్ని తెలియజేస్తుంది. ’’ అన్నారు.
ఇదీ చదవండి: షారూఖ్ను మించిపోయేలా, మహేష్ టేస్ట్ అండ్ స్టైల్ : ధర రూ. 8 కోట్లు!
ఈ రెస్టారెంట్ అసలు సిసలు ప్రాంతీయ రుచులను వడ్డించాలన్న ఉద్దేశంతో, భారతీయ రుచులను ఏ మార్పు లేకుండా వాటి అసలైన రూపంలోనే అమెరికాలో పరిచయం చేసింది. చక్కెర, ఉప్పు, మసాలా శక్తివంతమైన మోతాదుల్లో వాడుతూ మారుమూల గ్రామాల్లో లభించే రుచుల్ని ప్రతిబింబించింది. నెంబర్ వన్గా నిలిచింది.