చేతన
జీవితం అనేది నిరంతరాయంగా సాగిపోయే ఒక ప్రవాహం. ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలడం సహజమే అయినా, నేటి ఆధునిక కాలంలో చాలామంది చిన్నపాటి కష్టాలకే నైరాశ్యంలో మునిగిపోతున్నారు. విజయాల కోసం, బాహ్య ప్రపంచంలో ఎవరో వస్తారని ఎదురుచూడటం కన్నా.. ప్రతి మనిషి తనలోని అపారమైన అంతర్గత శక్తులను గుర్తించడమే పరమార్థం.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కాలం కలిసిరానప్పుడు బాహ్య పరిస్థితులను నిందించడం మాని, ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా మలచుకోవాలి. మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ, సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అవకాశాలుగా మార్చుకునే వివేకం లభిస్తుంది.
ఈ అంతఃశక్తిని మేల్కొలిపి, జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మన మహర్షులు కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా చంచలమైన మనస్సు ప్రశాంతతను ΄÷ంది, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టత వస్తుంది. దీనితో పాటు సద్గ్రంథ పఠనం బుద్ధిని వికసింపజేసి జీవన సత్యాలను బోధిస్తే.. సత్సంగం (మంచి వ్యక్తుల సహవాసం) మనలో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.
సముద్రంలో అలలు ఎంత సహజమో, జీవితంలో కష్టాలూ అంతే సహజం. ఎడారిలో సైతం వేళ్లను లోతుగా పాతుకుని జీవాన్ని వెతుక్కునే మొక్కలా.. మనిషి తన ఆత్మబలాన్ని నమ్ముకుని, ప్రతి కొత్త రోజును ఒక అవకాశంగా భావించి విజయపథంలో ముందుకు సాగాలి. – పసుపులేటి వెంకటేశ్వరరావు


