Jagannath Rath Yatra సర్వం జగన్నాథం | Jagannath Rath Yatra 2025 celebrated all over the inida | Sakshi
Sakshi News home page

Jagannath Rath Yatra సర్వం జగన్నాథం

Jun 28 2025 10:23 AM | Updated on Jun 28 2025 11:45 AM

Jagannath Rath Yatra 2025 celebrated all over the inida

పర్లాకిమిడి:  గజపతి జిల్లా పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా ఘోష యాత్ర మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. ఉదయం జిల్లా కలెక్టర్‌ బిజయ కుమార్‌దాస్, ఎస్పీ జ్యోతింద్ర నాథ్‌ పండా, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండాలు విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్రకు పహాండిని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను రథాలపైకి తీసుకెళ్లారు. అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీ దేవి గజపతి మేళతాళాలతో రాజ మందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శా్రస్తోత్తరంగా పూజలు చేసి బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. దీనిని చెరాపహారా అంటారు. స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిస్సీ నృత్యాలతో ప్రజలను అలరించారు. మూడు రథాలను గుండిచా మందిరం వైపు సాయంత్రం 5.00 గంటలకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. 

మల్కన్‌గిరిలో... 
జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా కలెక్టర్‌ ఆశిష్‌ ఈశ్వర్‌ పటేల్‌తో ఆలయ అర్చకులు పూజ నిర్వహించి రథం లాగడం ప్రారంభించారు. యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం కదిలే సమయంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. 


రాయగడలో... 
రాయగడలో రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథ మందిరం నుంచి దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా పొహండి నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రథంలాగే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్‌ ఫరూల్‌ పటా్వరీ, తహసీల్దార్‌ ప్రియదర్శిని స్వయి, కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తదితరులు రథంలాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ, చల్లని పానీయాలు వితరణ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక రైతుల కాలనీలోని జిమ్స్‌ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రథం అందరినీ ఆకట్టుకుంది. రథయాత్రను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక మజ్జిగౌరి మందిరం ట్రస్టు తరుపున మందిరం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.   

జయపురంలో... 
పట్టణంలో అంగరంగ వైభవంగా రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం యాత్ర జరగగా, ఒక్కరోజు తర్వాత అనగా శనివారం నుంచి జయపురంలో రథయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయం నుంచి దేవతామూర్తులను మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి రథాలపై ఆశీనులు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు దేవతామూర్తులకు భక్తులు పూజలు చేస్తారు. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తారు.  

కొరాపుట్‌లో... 
కొరాపుట్, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో రథయత్ర తొలి ఘట్టంలో భాగంగా రథాలు గుండిచా మందిరాలకు చేరుకున్నాయి. కొరాపుట్‌ జిల్లా కేంద్రంలో జయపూర్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి దంపతులు, కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘురాం మచ్చోలు పాల్గొన్నారు. నబరంగ్‌పూర్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి రథం లాగారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో సీఆర్‌పీఎఫ్‌ 12వ బెటాలియన్‌లో నేతృత్వంలో కమాండెంట్‌ ఎన్‌కేకే ప్రసాద్‌ నేతృత్వంలో రథయాత్ర జరిగింది. మరోవైపు విశ్వవ్యాప్త రథయాత్రకు విభిన్నంగా జయపూర్, ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా శనివారం రథయాత్ర జరగనుంది. శుక్రవారం మాత్రం పొహండి నిర్వహించి విగ్రహాలను రథం మీదకి చేర్చారు.  

 ఆకట్టుకునే పుష్ప మకుటం
స్వామివారి అలంకరణలో ఆకట్టుకునే అపురూప పుష్ప మకుటం. దీనిని యాత్ర వ్యవహారిక భాషలో ఠయ్యా అంటారు. సుగంధిత పుష్పాలతో దేవతా త్రయం బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుని కోసం వేర్వేరుగా 3 ఠయ్యాలు తయారు చేస్తారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమం తప్పకుండా వీటిని పంపిణీ చేస్తుంది. వీటి తయారీలో వెదురు బద్దలు, జీలుగు, జరీ కాగితాలు వంటి ఆకర్షణీయమైన వస్తువులతో పాటు సుగంధిత పుష్పాలను వినియోగిస్తారు. కదంబ పుష్పాలు ప్రముఖ స్థానం ఆక్రమించి ఆబాలగోపాల భక్త జనాన్ని ఆకట్టుకుంటాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement