కుంచె గీసిన చిత్రం.. | Hyderabad flyovers get colourful makeover | Sakshi
Sakshi News home page

కుంచె గీసిన చిత్రం..

Nov 30 2024 6:54 AM | Updated on Nov 30 2024 6:54 AM

Hyderabad flyovers get colourful makeover

అద్భుతమైన కళకు జీవం పోస్తున్న ఆర్టిస్టులు

నగరానికి కొత్త రంగులు అద్దుతున్న కుంచెలు 

ఒక్కో ప్రాంతంలో ఒక్కో థీమ్‌తో ఆకర్షిస్తూ 

పర్యావరణం, ఆరోగ్యం, జీవన శైలి, విభిన్న అంశాల్లో కళాకృతులు 

నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్‌ పిల్లర్లు, అండర్‌ పాస్‌ గోడలు కలర్‌ ఫుల్‌ పెయింటింగ్స్‌తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక్కో రకమైన థీమ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు.     

ఎల్‌బీనగర్‌ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకూ.. హైటెక్‌ సిటీ నుంచి ఉప్పల్‌ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్‌ సర్కార్‌ వచ్చిన తరువాత వాల్‌ పెయింటింగ్స్‌తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్‌ వంతెన, అండర్‌ పాస్‌ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో ఒక్కో రకమైన థీమ్‌తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్‌బీ నగర్‌ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్‌ డ్యాన్సర్స్‌ చిత్రాలు తీర్చిదిద్దారు.   

ఫ్లెక్సీ ప్రింటింగ్‌తో ముప్పు..
ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో  మార్కెట్‌లోకి డిజిటల్‌ ఫ్లెక్సీ ప్రింటింగ్‌ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్‌ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.

36 ఏళ్లుగా ఇదే వృత్తి..
1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్‌ పెయింటింగ్స్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్‌ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్‌ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. 
– అశోక్, కళాకారుడు, హయత్‌నగర్‌

ఆరు నెలలు పని కలి్పంచాలి.. 
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్‌ ఆర్ట్స్‌ అంటే సమాజంలో డిమాండ్‌ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. 
– సత్యం, కళాకారుడు, హయత్‌నగర్‌  

Advertisement
 
Advertisement
Advertisement