ఫ్లైఓవర్లకు పరీక్షలు | GHMC focuses on safety of old flyovers and ROBs | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్లకు పరీక్షలు

Jul 8 2026 1:57 AM | Updated on Jul 8 2026 1:57 AM

GHMC focuses on safety of old flyovers and ROBs

వీటి భద్రతపై జీహెచ్‌ఎంసీ నజర్‌

సాంకేతికతతో పునరుద్ధరణ పనులు 

24 ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జిలకు పునరుజ్జీవం 

సాక్షి, హైదరాబాద్‌ :  గ్రేటర్‌ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఓవైపు రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు అండర్‌పాస్‌ల నిర్మాణంతో పాటు.. మరోవైపు పాత ఫ్లై ఓవర్లు, ఆర్‌ఓబీల భద్రతపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. దశాబ్దాల క్రితం నిర్మించిన  ఫ్లైఓవర్లు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీ), రైల్వే అండర్‌ బ్రిడ్జిల (ఆర్‌యూబీ) భద్రతను అంచనా వేయాలని కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ నిర్ణయించారు. అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. నగరంలోని అత్యంత కీలక, రద్దీగా ఉండే 24 వంతెనలకు అత్యాధునిక సాంకేతికతతో సామర్థ పరీక్షలు నిర్వహించనున్నారు.  

నాన్‌–డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌తో..: సామర్థ్య పరీక్షల సందర్భంగా వంతెనలు దెబ్బతినకుండా, వాటి అంతర్గత బలాన్ని, లోపాలను కచ్చితంగా అంచనా వేసేందుకు ‘నాన్‌–డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఎన్‌డీటీ) పద్ధతుల్ని ఉపయోగించనున్నారు. ఇందుకుగాను ప్రత్యేక కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోనున్నారు.   

ఆధునిక ప్రక్రియలు ఇలా..  
యూపీవీ (అల్ట్రాసోనిక్‌ పల్స్‌ వెలాసిటీ) టెస్టింగ్‌ : దీని ద్వారా బ్రిడ్జిల కాంక్రీట్‌ అంతర్గత సాంద్రతను, నాణ్యతను పరీక్షించడానికి అల్ట్రాసోనిక్‌ తరంగాలను పంపిస్తారు. 3,330 పాయింట్ల వద్ద ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
ఆర్‌హెచ్‌టీ (రీబౌండ్‌ హ్యామర్‌ టెస్టింగ్‌): దీనిద్వారా కాంక్రీట్‌ యొక్క ఉపరితల గట్టిదనాన్ని అంచనా వేస్తారు. ఇందుకుగాను 790 పాయింట్ల వద్ద పరీక్షలు నిర్వహిస్తారు 
లోపాల గుర్తింపు: గర్డర్లలో ఏర్పడే ఖాళీలు, దెబ్బతిన్న బేరింగ్‌ ప్రాంతాలు,పాడైన ఎక్స్‌పాన్షన్‌ జాయింట్లను  క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పియర్లు, పియర్‌క్యాప్‌లు, డయాఫ్రమ్‌లలోని లోపాలను గుర్తిస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఏ వంతెనకు ఎలాంటి మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు అవసరమో వాటిని అమలు చేస్తారు. 

ప్రమాదాల నివారణ  
ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ వంతెనలకు ఆధునిక సాంకేతికతతో  పరీక్షలు నిర్వహించాక, నివేదికల ఆధారంగా ప్రతి వంతెనకు ప్రత్యేక పునరుద్ధరణ ప్రణాళిక రూపొందించి ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ సహదేవ్‌ రత్నాకర్‌ తెలిపారు. తద్వారా వంతెనల జీవితకాలం కూడా పెరుగుతుందన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement