వార్డులు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వానికే అధికారం
సరిహద్దులు మారొచ్చు.. ఎన్నికల ముందు గేమ్కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: త్వరలో రానున్న క్యూర్–2026 చట్టానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా బిల్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా, బిల్లులోని సెక్షన్ 312తో ప్రభుత్వం తల్చుకుంటే వార్డులు, సర్కిళ్ల స్వరూపం మారుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం అవసరమైతే ప్రభుత్వం వాటిని పునర్వ్యవస్థీకరించవచ్చని పేర్కొన్నప్పటికీ, ఎన్నికల చూపుతో అధికార పార్టీ దాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మూడు కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు, సరిహద్దుల మార్పు, జోన్ల పునర్మిర్మాణం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మార్పులు.. ఎక్కడ.. ఎలా?
అనుకూలమైన ప్రాంతాలను ఒకచోటకు చేర్చి ప్రత్యర్థుల బలమైన ఓటుబ్యాంకును దెబ్బతీసేలా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అధికార పార్టీకి బ్రహ్మస్త్రంలా పనికొస్తుందని చెబుతున్నారు. అందుకు కారణాలిలా ఉన్నాయి.
పారదర్శక ఓటర్ల విభజన
విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న వార్డుల్లో వారు ఒకేపార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలెక్కువ. అలాంటి వార్డులను వేరే సర్కిళ్లలో కలపడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు.
విపక్షాల కోటలకు బీటలు
ప్రతిపక్షాలు వరుసగా గెలుస్తూ వస్తున్న బలమైన వార్డులను, అధికార పార్టీ బలంగా ఉన్న ఇరుగుపొరుగు వార్డుల్లో విలీనం చేయడం ద్వారా లాభపడవచ్చు. కార్పొరేషన్ పరిధిలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కార్పొరేషన్ల ఎన్నికల లోపున ఏ సర్కిల్లో ఏవి కలుస్తాయో, వేచి చూడాల్సిందే.
వార్డులు పెరిగితే..
కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని, సీఎంసీ, ఎంఎంసీల్లో మధ్య తరగతి, కొత్త నివాసప్రాంతాల్లో బీజేపీకి అవకాశం ఉంటుందని చెబతున్నారు. బీఆర్ఎస్ ఇప్పటి వరకున్న బలాన్ని నిలబెట్టుకోవడం ఆపార్టీకి సవాల్గా మారనుండగా, ఎంఐఎంకు తన స్థానాల్లో ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు.
ప్రశ్నలు ఇలా..
ప్రభుత్వానికి అధికారమున్నా, కొన్ని ఆటంకాలు తప్పకపోవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అవేమిటంటే.. సెక్షన్–312 (Section 312) ద్వారా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేయవచ్చు. కానీ, ఆయా కార్పొరేషన్లకు పాలమకండళ్లు లేప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. ప్రతిపక్షాలు కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.


