ఇన్సూరెన్స్ దిగ్గజం ’నేషన్వైడ్’ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసినట్టు బుధవారం ప్రకటించింది. అమెరికా వెలుపల సంస్థ ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ ఇదే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఇది నాల్గవ సాంకేతిక హబ్. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సంస్థ ’గ్లోబల్ 24/7 ఆపరేటింగ్ మోడల్’ విధానాన్ని ఎంచుకుంది.
ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఇంజనీరింగ్, అప్లికేషన్ సపోర్ట్ వంటి అత్యాధునిక డిజిటల్ సామర్థ్యాలను ఇక్కడి నుంచే పెంపొందించనున్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు హైదరాబాద్ అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందన్నారు. ప్రపంచంలోని టాప్-10 బీఎఫ్ఎస్ఐ దిగ్గజాల్లో 9 సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నడిపిస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రముఖ అమెరికన్ ఇన్సూరెన్స్ సంస్థ ’నేషన్వైడ్’ను తెలంగాణ గ్లోబల్ వాల్యూ సెంటర్స్ జాబితాలోకి స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు.


