ప్రియుడితో కలిసి భర్త హత్య.. 250 కిలోమీటర్లు తీసుకెళ్లి.. దారుణం! | Wife Murders Husband With Her Lover Hyderabad Miyapur Crime | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్త హత్య.. 250 కిలోమీటర్లు తీసుకెళ్లి.. దారుణం!

Jul 9 2026 7:25 AM | Updated on Jul 9 2026 8:54 AM

Wife Murders Husband With Her Lover Hyderabad Miyapur Crime

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

మృతదేహాన్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి దహనం

భార్య, ప్రియుడు, మరొకరి అరెస్ట్‌

నిందితులు మధుసూదన్‌రెడ్డి, సత్యవతి 

మృతుడు పెంటేష్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌, మియాపూర్‌: ఆస్తి కోసం ఓ మహిళ భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఆ తరువాత మృతదేహాన్ని 250 కిలోమీటర్లు తీసుకెళ్లి దహనం చేసింది. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ వివరాలు వెల్లడించారు. అంబేద్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన మల్లాని పెంటేష్‌ కుటుంబ కలహల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఏపీలోని అనకాపల్లికి చెందిన సత్యవతి.. పెంటేష్‌ నిర్మిస్తున్న ఇంటి పనుల కోసం ఇంటికి వచ్చేది. ఇద్దరి మధ్యా పరిచయం పెరగడంతో 2009లో సత్యవతిని పెంటేష్‌ వివాహం చేసుకున్నాడు. పెంటేష్‌కు 4 ఎకరాల భూమితో పాటు మియాపూర్‌లో రెండు భవనాలు ఉన్నాయి.

భార్యకు జిమ్‌ ట్రైనర్‌తో పరిచయం..
వనపర్తికి చెందిన జిమ్‌ ట్రైనర్‌ మధుసూదన్‌రెడ్డి.. పెంటేష్‌ ఇంట్లో అద్దెకుండేవాడు. ఈ క్రమంలో సత్యవతి, మధుసూదన్‌ రెడ్డిల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడూ మధుకు సత్యవతి డబ్బులిచ్చేది. దీంతో పెంటేష్‌ ఇద్దరినీ హెచ్చరించి మధును ఇల్లు ఖాళీ చేయించాడు. ఆ తరువాత కూడా ఇద్దరి మధ్యా సంబంధం కొనసాగింది.  ఈ క్రమంలో గతేడాది పెంటేష్‌ మి యాపూర్‌లోని షట్లర్లను విక్రయించగా రూ.80 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లోనే ఉంచాడు. అందులోంచి రూ.10 లక్షలు మధుకు ఇచ్చింది. ఈ విషయం బయట పడడంతో పెంటేష్, సత్యవతి మధ్య గొడవ జరిగింది.  దీంతో భర్తను హత్య చేయాలని సత్యవతి మధుసూదన్‌కు తెలపడంతో ఇద్దరు  కలిసి  పథకం రూపొందించారు.

నిద్రమాత్రలు ఇచ్చి.. 
2025 నవంబర్‌ 18న సత్యవతి భర్త పెంటేష్‌ భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. స్పృహా కోల్పోయిన అనంతరం మధుసూదన్, చిన్న నాటి స్నేహితుడు  రాజేష్‌ కుమార్‌ వచ్చారు. పెంటేష్‌ ముఖం పై దిండు పెట్టి గొంతు నుమిలి హత్య చేశారు. అనంతరం ఆన్‌లైన్‌లో కారు బుక్‌చేసుకొని రాత్రికి రాత్రే 250 కిలోమీటర్లూ దూరంలోని నల్‌దుర్గు ( మహారాష్ట్ర) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి దహనం చేసి అక్కడే వదిలేసి వచ్చేశాడు.  

భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. 
ఆ తరువాత.. తన భర్త కనిపించడం లేదంటూ సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దర్యాప్తులో భాగంగా  సత్యవతి, మధుసూదన్‌రెడ్డి కాల్‌ డేటా, సిగ్నల్స్‌ వివరాలను విశ్లేషించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో మియాపూర్‌ పోలీసులు సత్యవతి, మధుసూదన్‌రెడ్డి, మృతదేహాన్ని  తరలించడంలో సహకరించిన రాజేష్‌ను అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా తమ తండ్రి కనిపించడం లేదని  మొదటి భార్య పిల్లలు భరత్‌ రాజ్, సంధ్యలు సత్యవతి పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించినా తమ ఫిర్యాదు స్వీకరించలేదని ఆరోపించారు. సత్యవతి ప్రవర్తనలో మార్పులు కనిపించాయని చెప్పినా స్పందించలేదన్నారు. భరత్‌రాజ్‌ పైనే అనుమానం వచ్చేలా సత్యవతి పోలీసులకు కట్టుకథలు చెప్పిందని వాపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement