గుజరాతీ ఖాండ్వీ
కావలసినవి: శనగపిండి – కప్పు, కారం పొడి – 1/4 టీస్పూన్, ఉప్పు – 1/2 టీస్పూన్, ఇంగువ – చిటికెడు, పెరుగు – 1 కప్పు, నీళ్లు – 2 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్, నువ్వులు – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు – కొన్ని, గార్నిషింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర (సన్నగా తరిగినది)
తయారీ: ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, చిటికెడు ఇంగువ, కప్పు పెరుగు తీసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి, మజ్జిగలా పల్చగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద కడాయిలోకి పోసి, స్టవ్ మీద సన్నని మంటపై పెట్టి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇది రిబ్బన్ లాగా జారుడుగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక గరిటెడు ఉడికిన శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని, వెంటనే ఒక ప్లేట్ వెనుక భాగంలో సాధ్యమైనంత పల్చగా పరచాలి. ఇలా పరిచిన మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత, దానిని రెండు ఇంచుల వెడల్పు ఉన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసి, ఎక్కడా విరిగిపోకుండా జాగ్రత్తగా గట్టిగా రోల్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేసి అందులో టీస్పూన్ ఆవాలు, టీస్పూన్ నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. పోపు వేగాక, దానిని తయారు చేసి పెట్టుకున్న ఖాండ్వీ రోల్స్పైన సమానంగా పోయాలి. ఆపై పైన పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఖాండ్వీని వేడి వేడి చాయ్ తో కలిపి ఆస్వాదించడమే!
ఆలూ అండా కుర్మా
కావలసినవి: ఉడకబెట్టిన కోడిగుడ్లు – 4, బంగాళదుంపలు – 2 (పొట్టు తీసి, ముక్కలుగా కోసుకున్నవి), నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, గ్రేవీ కోసం: ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది లేదా పేస్ట్), అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్, టొమాటోలు – 2 (ప్యూరీ లేదా సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి – 3 (నిలువుగా చీల్చినవి), జీలకర్ర – టీస్పూన్, కారం పొడి – టీస్పూన్, పసుపు – 1/2 టీస్పూన్, ధనియాల పొడి – టీస్పూన్, గరం మసాలా పొడి – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, గార్నిషింగ్ కోసం– సన్నగా తరిగిన కొత్తిమీర.
తయారీ: ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఒక ఫోర్క్ లేదా టూత్పిక్తో అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టండి. ఇప్పుడు ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేయండి. ఇందులో ఉడకబెట్టిన గుడ్లను వేసి 2–3 నిమిషాల పాటు పైన లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, పక్కన తీసి పెట్టుకోండి. అదే నూనెలో బంగాళదుంప ముక్కలను కూడా వేసి, అంచులు కొద్దిగా వేగే వరకు 3–4 నిమిషాలు వేయించి, పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, దోరగా వేయించండి. ఇప్పుడు అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి.
ఆ తర్వాత టొమాటో ప్యూరీ, కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు దీనిని ఉడికించాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఈ మసాలాలో వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా రెండు నిమిషాలు కలపండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా 2 కప్పుల గోరువెచ్చని నీళ్లు పోయండి. నీళ్లు మరగడం ప్రారంభమయ్యాక, బాణలిపై మూత పెట్టి, మంటను మీడియమ్లో ఉంచి బంగాళదుంపలు మెత్తగా ఉడికించండి.
బంగాళదుంపలు ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను, చీల్చిన పచ్చిమిర్చిని గ్రేవీలో వేయండి. సన్నని మంట మీద మరో 3–4 నిమిషాలు ఉంచండి, దీనివల్ల గుడ్లు గ్రేవీని బాగా పీల్చుకుంటాయి. చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలూ అండా కుర్మా రెడీ! ఇది వేడి వేడి రోటీలు, చపాతీలు లేదా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.


