సత్యాన్వేషణ | Exploring the nature of existence and the human experience | Sakshi
Sakshi News home page

సత్యాన్వేషణ

Apr 14 2025 1:29 AM | Updated on Apr 14 2025 1:29 AM

Exploring the nature of existence and the human experience

ఆత్మదర్శిని

నీలోని ఆత్మ చైతన్యమే సత్యం. నేను వ్యక్తిని అనే భావన పూర్తిగా నీ మనస్సు కల్పితం. నీకు కనిపించే వ్యక్తులు, పాత్రలు, బంధాలు, సమాజం మొదలైనవన్నీ మనస్సు కల్పనలేగాని సత్యాలు కావు. భార్య, పిల్లలు, ఉద్యోగం, లక్ష్యాలు, అన్వేషణ మొదలైనవన్నీ నిజాలని నమ్ముతూ వాటిలో చిక్కుకొనిపోయి ఒక దుఃఖ ప్రపంచంలోకి వెళ్ళి పోతున్నాం. ఇవన్నీ అసత్యాలు కదా అని వీటిని వదిలేయటం కూడా పరిష్కారం కాదు. 

సత్యాన్ని తెలుసుకునే మార్గం, అనందాన్ని పొందే మార్గం ఉంది. నీనుండి విడివడలేనంత దగ్గరగా ఉంది. ప్రశాంతత, అనందం అనేవి నీ ఆత్మలోనే ఉన్నాయి. అవి దైవత్వ పరిమళాలు. ఇది బయటి ప్రపంచంలో కనిపించే ప్రశాంతత కాదు. అది అంతం లేనిది నీ అంతర్గత ప్రశాంతత. అది విషయ సంబంధమే కాదు. కాలానికి, స్థలానికి అతీతమైనది. ఆ నిగూఢమైన ప్రశాంతతే నీ ఆత్మ, నీ నిజతత్వం. నేను వ్యక్తిని అనే భావన పుట్టుకతో నీలో లేదు. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల, సమాజం వల్ల క్రమంగా నేను అనే భావనలో చిక్కుకుని కాలంతో కలిసిపోయాం.

 నీ నిజస్థితి దివ్యచైతన్య స్థితి. అద్వైతస్థితి. మాయవల్ల ఆ చైతన్యం నుండి విడివడి నేను శరీరాన్ని, మనస్సును అనే పరిమితిలో చిక్కుకుని పోయావు. నీ కలలో నీవు చిక్కుకు పోయావు. అసలు చైతన్యం అనేది ఒక వ్యక్తికి, ఒక రూపానికి పరిమితమైనదే కాదు. అది అనంతం, నిర్గుణం. అది దేనికీ అంటదు. కేవలం సాక్షితత్వమే ఉంటుంది. నేను అనే భావన క్రమంగా బలపడి ఇష్టాయిష్టాలతో, నమ్మకాలతో, కోరికలతో బందీ ఐపోతాము. నిజానికి అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకున్నపుడే ఈ దుఃఖ ప్రపంచం నుండి బయటపడగలవు.

నీ మనస్సుకు కూడా మూలం ఆత్మనే. ఈ విషయ ప్రపంచం, ఈ భిన్నత్వం అంతా కూడా ఆత్మ నుంచి ఉద్భవించినవే. కానీ వీటిని ‘నేను’ అనుకుని ఒక పరిమితి కల్పించుకుని, విశ్వ చైతన్యం నుండి వేరుపడిపోయాము, నమ్మకాలను సృష్టించుకున్నాం. వ్యక్తి అనేవాడు కూడా దైవత్వ వ్యక్తీకరణే. విశ్వ చైతన్యంలో భాగమే. మాయవల్లనే నేను వేరు అనే భావన కల్పించుకొని, భద్రతను సృష్టించుకుని, అభద్రతను కూడా సృష్టించుకుని దుఃఖంలో ఉన్నాము. ఈ నాటకమంతా నీ సృష్టే. ఇందులోని పాత్రలన్నీ పరస్పర సంబంధమైనవే. సృష్టికర్త సృజనాత్మక వ్యక్తీకరణే ఈ నాటకం. ఆ రచయిత నీవే. అత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీవే ఆ దివ్యచైతన్యమని, సృష్టికర్తవని తెలుస్తుంది. వీటన్నింటికీ ఒక సాక్షిగా ఉంటావు, వేటికీ అంటకుండా.

కలలో ఉన్నప్పుడు నీవు కలలో ఉన్నట్టు తెలియదు. కలలో గెంతుతాము, అరుస్తాము, భయపడతాము... ఇది కల అని తెలియగానే కల మాయమైపోతుంది. ఇప్పటి మన జీవితమంతా ఈ కలలాంటిదే. సత్యాన్ని తెలుసుకున్నపుడే ఈ కలలనుండి బయటపడతావు. ఎల్లప్పుడూ నీ నిజతత్వాన్ని తెలుసుకునే దిశగానే ప్రయాణించు. ఈ జీవితం నాటకమైనప్పటికీ ఇందులో జీవించడం అవసరం. శరీరం, మనస్సులకు సాక్షిగా ఉంటూ జీవించు. నీలోని ఆత్మచైతన్యం బలపడినప్పుడే ఈ కలల నుండి బయటపడతావు. మనస్సుకు స్వతహాగా బలం ఉండదు. అది నీ ఆత్మశక్తిని లాక్కుని జీవిస్తుంది. నీవు సాక్షిగా గమనించినప్పుడు అది బలహీనమైపోతుంది. నీలోని నమ్మకాలకు, కోరికలకు, సంవేదనలకు అన్నింటికీ సాక్షిగా ఉంటూపో! వేటితోనూ అంటకు.

– స్వామి మైత్రేయ ఆధ్యాత్మిక బోధకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement