
దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధితుల సంఖ్య రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా తన భర్త, చిత్ర నిర్మాత కనిపించడంలేదంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా సందేహాల మధ్య కుటుంబం DNA నమూనాలను సమర్పించింది . మరోవైపు అతని మొబైల్ ఫోన్ చివరిగా భయంకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి కేవలం 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.
నరోడా-నివాసి మహేష్ కలవాడియా, మహేష్ జిరావాలా (Mahesh Jirawala) అని కూడా పిలుస్తారు. సంగీత ఆల్బమ్లకు దర్శకత్వం వహిస్తాడు. లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లి, అదృశ్యమైనాడని అతని భార్య హేతల్ ఫిర్యాదు చేసింది.
"నా భర్త మధ్యాహ్నం 1.14 గంటలకు నాకు ఫోన్ చేసి తన సమావేశం ముగిసిందని, ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, నేను అతని ఫోన్కు కాల్ చేసాను కానీ అది స్విచ్ ఆఫ్ అయింది. అతని స్కూటర్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత, అతని మొబైల్ ఫోన్ చివరిగా అతను క్రాష్ సైట్ నుండి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు చూపించింది" అని ఆమె ఆందోళన చెందుతోంది. సాధారణంగా తన భర్త ఈ మార్గంలో ఎపుడూ రాడని, ఏమైందో అర్థం కావడంలేదని హేతల్ తెలిపింది.
కాగా గుజరాత్లోని అహ్మదాబాద్లోసర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే మేఘనినగర్లోని ఒక వైద్య కళాశాల ప్రాంగణంలోకి విమానం కూలిపోయింది. AI-171 విషాదకరమైన ప్రమాదం జరిగి మూడు రోజుల తరువాత, ఇప్పటివరకు 270 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆసుపత్రి అధికారులు ఆదివారం DNA మ్యాచింగ్ ద్వారా 47 మంది బాధితులను గుర్తించినట్లు నిర్ధారించారు. అధికారులు 24 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. భయంకరమైన విషాదంలో బాధితుల గుర్తించేందుకు ధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు.