
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్తో బదులిచ్చింది. దీంతో పాకిస్తాన్ యుద్ధానికి కాలుదువ్వుతూ ..పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. రాజస్థాన్ నుంచి కశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి పాక్ చేసిన దాడులన్నింటినీ భారత్ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. అంతేగాదు దాడుల ధాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇరుదేశాల నడుమ తీవ్ర యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఈ నేపథ్యంలో దాయాది దేశం పాక్ గతంలో భారత్తో యుద్ధానికి దిగినప్పడు..భారత్ దేశభక్తిని చాటేలా ఎలా ఐక్యతగా వ్యవహరించి చక్కబెట్టిందో తెలుసుకుందామా. ఆ సమయంలో ఉన్న నాటి ప్రధానులు ఎలాంటి నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపించారు తదితర విశేషాలు చూద్దామా..!
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరు వినగానే కళ్ల ముందు ఆ నాయకుడి అసామాన్య ధైర్యసాహసాలు కదలాడతాయి. భారతదేశ ప్రయోజనాల కోసం ఉత్తేజకరమైన పదాలతో ఇచ్చే ఉపన్యాసాలు అందర్నీ ప్రభావితం చేసేలా ధైర్యాన్ని నింపుతాయి. ఆయన చాలా డేరింగ్గా పోఖ్రాన్-II అణు పరీక్షలకు అధికారం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. దాంతోనే దశాబ్దాలుగా అణ్వాయుధ పరీక్షలపై ఉన్న తాత్కాలిక నిషేధానికి ముగింపు పలికారు. అందువల్లే ఇప్పుడు భారతదేశం అణ్వాయుధ దేశంగా మారింది.
నాటి అమెరికా అధ్యక్షుడుకి రహస్య లేఖ..
1999 కార్గిల్ యుద్ధం సమయంలో, వాజ్పేయి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కు ఒక ‘రహస్య లేఖ’ పంపారు. అయితే క్లింటన్ ఆ సమయంలో జెనీవాలో ఉన్నారు. దాంతో ఆ సందేశాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు శామ్యూల్ ఆర్.శాడీ బెర్గర్ అందుకున్నారు. ఆ లేఖలో వాజ్పేయి వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలోని భారత స్థావరాలను స్వాధీనం చేసుకున్న దళాలను వెనక్కి తీసుకోకపోతే భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయాల్సి వస్తుందని వాజ్పేయి హెచ్చరించారు.
అయితే అందుకు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశంపై అణు దాడి చేస్తామని బెదిరింపులకు దిగినట్లు అమెరికా తెలియజేసింది భారత్కి. అంతే మాజీ ప్రధాని వాజ్పేయి దానికి ఇలా సమాధానం ఇచ్చారు. తాను 25% భారతీయులను కోల్పోవడానికి సిద్ధమే..కానీ పాకిస్తాన్ మరుసటి రోజు సూర్యుడిని చూడదని మీకు హామీ ఇస్తున్నా అని తేల్చి చెప్పారు. ఇక ఆ కార్గిల్ యుద్ధంలో జమ్ముకశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లోని పర్వతాలను పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ క్రమంలో ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమికొట్టి భారత్ ఈ యుద్ధంలో గట్టి విజయం సాదించింది. 1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది.
అధికారం లేకపోయినా..
1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో, వాజ్పేయి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయాలు ముఖ్యం కావని ఘంటాపథంగా చెప్పేవారు. నిజానికి ఆ సమయంలో వాజ్పేయి జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ తర్వాత ఆ జనసంఘ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీ (BJP)గా, ప్రముఖ ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడూ..ఐక్యతకు పెద్దపీటవేసిన మహోన్నత వ్యక్తి.
మొదటి యుద్ధం టైంలో గుండెల్ని తాకే ప్రసంగం..
పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్పేయి ప్రసంగం చూస్తే.. నరనరాల్లోనూ దేశభక్తి ఉప్పొంగిలే..ఉంటుంది. ఆ హిందీ ప్రసంగం అనువాదం.."మనం అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాము. అగ్ని నుంచి బంగారం శుద్ధి చేయబడి బయటకొచ్చినట్లుగా ఈ సమస్య నుంచి బయటపడి గెలుపు మనదే అయ్యేలా చేసుకుందాం. అలాగే మన సరిహద్దులను రక్షించుకుని, పాకిస్తాన్ పాలకులకు మర్చిపోలేని గట్టి గుణపాఠం నేర్పిద్దాం.
ఈ రోజు నేను ఏ రాజకీయ పార్టీ తరపున మాట్లాడటానికి సిద్ధంగా లేను. ప్రస్తుతం దేశంలో మనమంతా ఒకే పార్టీ. మన మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి.. యావత్ దేశం విజయం వైపు ముందుకు సాగాలి . భుజం-భుజం కలిపి, దశలవారీగా దాడులతో చిత్తుచేసి గట్టి విజయం అందుకుందాం. అంతేగాదు ఈ పోరాటం ఏ త్యాగాలను కోరినా..అందుకు సంసిద్ధంగా ఉందాం." అని ప్రసంగించారు వాజ్పేయి. హృదయాలను కదలించే ప్రసంగం ఇప్పటికి చెవుల్లో మారుమ్రెగుతున్నట్లే ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు.
(చదవండి: Operation Sindoor: 'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం)