కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నిబంధనల ప్రకారం భూమిని పొంది, అన్ని అనుమతులూ ఉన్నా కూడా ఏలూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంపై చంద్రబాబు కూటమి కుట్రలు ఆగలేదు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలంటూ నగరపాలక సంస్థ అధికారులు చీటికిమాటికి ఈ కార్యాలయంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. చివరకు స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారన్న అక్కసుతో ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు సోమవారం ఏకంగా కార్యాలయానికి తాళం వేశా రు. పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకులనూ నిర్వహించుకోకూడదా అంటూ వైఎస్సార్సీపీ శ్రేణు లు, ప్రజలు మండిపడుతున్నారు.
నిబంధనల ప్రకారమే స్థలం కేటాయింపు
గత ప్రభుత్వ హయాంలో జీఓ 826/1987, జీఓ 340/2016ను అనుసరించి జీఓ 358/ 2022 ద్వారా వైఎస్సార్సీపీకి ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం వద్ద రెండెకరాలను కేటాయించారు. అదే సంవత్సరం జూన్లో కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వగా సెప్టెంబర్లో భూమిని అప్పగిస్తూ పొజిషన్ సర్టిఫికెట్ కూడా అందజేశారు. కార్యాలయం నిర్మాణానికి 2023 ఆగస్టు 8న కార్పొరేషన్కు భూమిని తనఖా పెట్టి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్లాన్ అప్రూవల్ కూడా పొందారు. 2024 జూన్ 25న ఇడా నుంచి ప్లాన్ అప్రూవల్ ఇస్తూ పర్మిట్ ఆర్డర్ ఇచ్చారు. 2030 జూన్ 20వ తేదీలోగా నిర్మా ణ పనులు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు.
ప్రభుత్వం మారగానే కుట్రలు
చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాగానే ఈ కా ర్యాలయంపై కుట్రలు మొదలయ్యాయి. అతిక్రమణలు ఉన్నాయంటూ నగరపాలక సంస్థ నుంచి నోటీసులు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ పూర్తి వివరణ ఇచ్చి హైకోర్టులో రిట్ పిటిషన్ (నంబర్ 13408/2024) దాఖలు చేయగా డీవియేషన్లకు సంబంధించి షార్ట్ఫాల్ ఉంటే నిబంధనల ప్రకారం చెక్లిస్ట్ ఫాలో అవ్వాలని ఆదేశించింది. రెండేళ్లు గడిచినా నగరపాలక సంస్థ అధికారుల నుంచి స్పందన లేదు. అతిక్రమణలు ఏమి జరిగాయో కూడా ఇప్పటికీ చెప్పలేదు. నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ పార్టీ కార్యాలయం విషయంలో అత్యుత్సాహంతో ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టులో రిట్ పిటిషన్ (22124/ 2025) దాఖలు చేయగా.. ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, కార్యాలయాన్ని సీజ్ చేయడంగాని, కూల్చివేయడంగాని చేయకూడదంటూ హైకోర్టు గతేడాది ఆగస్టు 1న ఆదేశాలిచ్చింది.
కమిషనర్పై కోర్టులో కేసు వేస్తాం
ఏలూరు కమిషనర్ భానుప్రతాప్ అత్యుత్సాహంతో కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో కేసు దాఖలు చేస్తామని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు తెలిపారు.
ఏలూరు వైఎస్సార్సీపీ కార్యాలయానికి తాళం
స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారని అక్కసు
కమిషనర్ భానుప్రతాప్ అత్యుత్సాహం
అన్ని అనుమతులూ ఉన్నా.. చీటికిమాటికి కార్యాలయంపై కుట్రలు
కోర్టు ఆదేశాల ధిక్కరణ
రెండు పర్యాయాలు కరెంట్ కనెక్షన్ తొలగింపు
కార్యాలయం పనులకూ అడ్డంకులు
ఇప్పుడు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కార్యాలయానికి తాళాలు
అయినా విద్యుత్ శాఖ, నగర పాలక సంస్థ అధికారులు తరచూ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఈ ఏడాదిలో ఎలాంటి కారణం లేకుండా రెండుసార్లు విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. చివరికి కోర్టు ఆదేశించిన తర్వాత విద్యుత్ను పునరుద్ధరించారు. కొద్దినెలల క్రితం కార్యాలయంలో పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సోమవారం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పది మంది టౌన్ప్లానింగ్ సిబ్బంది వచ్చి వాచ్మెన్ను, అక్కడ ఉన్నవారిని భయపెట్టి కార్యాల యం నుంచి బయటకు పంపేసి తాళాలు వేశారు. ప్లాన్ అనుమతి నుంచి అన్నీ సక్రమంగా ఉన్నా ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పకపోగా, వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు.


