ఏలూరు (టూటౌన్): ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఏలూరు నగరంలో క్రైస్తవులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకుండా గత 76 సంవత్సరాలుగా తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆగస్టు 10న నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు గ్జేవియర్ నగర్లోని అమలోద్బవి కెథడ్రల్ గురువులు, పాస్టర్లు వివిధ మత శాఖలకు చెందిన క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఐసిఎం అగ్ర పీఠాధిపతులు రెవ.జాన్ ఎస్డి రాజు ప్రార్థన చేసి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక అమలోద్భవి కెథడ్రల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారిలో కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్ ఏఓకి మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు పీఠం ఎస్సీ, బీసీ కమిషన్ సెక్రటరీ ఫాదర్ ప్రసాద్, ఫాదర్ మైఖేల్, పెరికె వరప్రసాదరావు,డి. అబ్రహం, ఇంజ్ పాల్, డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, ఎన్ఏడి పాల్, పొలిమేర హరికృష్ణ, తోట ఎడ్వర్డ్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 319 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 174 మందికి 161 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 175 మందికి 158 మంది హాజరు కాగా 17 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను జిల్లా స్థాయి పరిశీలకుడు కే.నాగేశ్వర రావు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
టెట్కు 407 మంది హాజరు
భీమవరం: జిల్లాలో సోమవారం టెట్ పరీక్షలకు 407 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. 451 మందికి 44 మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఓవీఎస్ అనిల్కుమార్ చెప్పారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ కర్మాగారాల డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 11 నుంచి 15 వరకూ ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో కర్మాగారాల తనిఖీ అధికారులు తనిఖీ చేయను న్నారు. కర్మాగారాల ఉప ముఖ్య తనిఖీ అధికారి కె.క్రిష్ణమూర్తి, కర్మాగారాల తనిఖీ అధికారి(రాజమండ్రి) ఎ.శ్రీనివాస్ రెండు జిల్లాల్లోని మొత్తం 25 కర్మాగారాలను తనిఖీ చేయనున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్న కర్మాగారాల్లో పనిచేస్తున్న భద్రతా అధికారుల పనితీరును వీరు పరిశీలిస్తారు. కర్మాగారాలను సందర్శించి వారి పనితీరుపై నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): నారాయణపురంలోని లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో ఈనెల 13న జాబ్మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్రబాబు ప్రకటనలో తెలిపారు. సుమారు 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 950 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 96425 98324, 77101 77767 (99888 53335–టోల్ఫ్రీ) నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
ఆకివీడు: ఆకివీడు ప్రధాన సెంటర్లో జాతీయ రహదారి–165పై గంగానమ్మకోడు మురుగు కాల్వకు ఉన్న కల్వర్టు ఇటీవల ధ్వంసమైంది. దీంతో ప్రమాదభరితంగా మారింది. ఈ నెల 6వ తేదీన ‘ప్రమాదభరితంగా జాతీయ రహదారి కల్వర్టులు’ శీర్షికతో సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనానికి జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించారు. వెంటనే ధ్వంసమైన కల్వర్టుకు పిట్టగోడ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో కల్వర్టుల గోడలు విరిగి ప్రమాదభరితంగా మారాయి.


