
చెరువుల్లో మట్టిని తోడేస్తున్న మాఫియా
నూజివీడు: అధికార పార్టీ మట్టి మాఫియా చెరువుల్లోని మట్టిని తోడేస్తోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తు న్నా అధికార వర్గాలు కళ్లుమూసుకుని కూర్చుంటున్నారే గానీ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన టీడీపీ నాయకుడు గ్రామంలో ఉన్న పాలెం చెరువులో మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు చేపట్టి మట్టిని బయటకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ట్రక్కు మట్టిని రూ.500ల నుంచి రూ.600లకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇందులో ప్రొక్లెయిన్తో తవ్వి ట్రాక్టర్ నింపడానికి రూ.100లు చెల్లిస్తున్నారు. ఈ చెరువు మట్టి ఓగిరాల తండా, హటియాతండా, హరిశ్చంద్ర తండాలకు వెళ్తోంది. ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఎవరైనా తమకు మట్టి కావాలంటే వారికి తోలకుండా కేవలం టీడీపీ వారికే మట్టిని అమ్ముతున్నారని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు అనేది గ్రామ ప్రజలందరదీ అయినప్పుడు కొంతమందికి తోలడం, కొంతమందికి తోలకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా మైనింగ్ చేసి మట్టిని అమ్ముకుంటున్నా ఇటు రెవెన్యూ అధికారులు గానీ, అటు ఇరిగేషన్ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ ఏమీ పట్టనట్లు ఉండటం గమనార్హం. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి గ్రామస్తుల నుంచి రెవెన్యూ అధికారులకు అక్రమ తవ్వకాలపై పదేపదే ఫోన్లు రావడంతో మట్టి తవ్వకాలను ఆపారు. ఇటీవల ఆగిరిపల్లి మండలం నర్సింగపాలెంలో సీఎం ఇంటి మెరక పనులకు అంటూ కొండ నుంచి గ్రావెల్ను అక్రమంగా తవ్వి టిప్పర్లలో తరలించి అమ్ముకున్నారు. ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతున్న తవ్వకాల గురించి అధికారులు పట్టించుకోకపోయినా గ్రామస్తులే అడ్డుకున్నారు. ఇదే మండలంలోని ఈదరలోని పంగిడమ్మ చెరువులోని మట్టిని సైతం కొల్లగొడుతున్నారు. ఈ చెరువు నుంచి మట్టి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు మట్టిమాఫియా సరఫరా చేస్తోంది. నూజివీడు మండలంలో కొన్నంగుంట, పోతురెడ్డిపల్లి, మొర్సపూడి, చాట్రాయి మండలం పోలవరం తదితర గ్రామాల్లో కూడా చెరువుల్లోని మట్టిని అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు.