నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వి.విజయ రామరాజు సూచించారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో డెమోక్రటిక్ పీఆర్టీయూ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డీ. శ్రీను, ప్రధాన కార్యదర్శి పీ. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: ఉత్తమ వర్జీనియా పొగాకు రైతు అవార్డుకు కన్నాపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ ఎంపికైనట్లు పొగాకు వేలం నిర్వహణ అధికారిని గ్రేసి మార్గరెట్ బుధవారం తెలిపారు. ఎంపీటీసీగా విధులు నిర్వహిస్తున్న బాజీ వర్జీనియా సాగులో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను బోర్డు ఆయన్ను ఎంపిక చేసిందన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించే కార్యక్రమంలో బాజీకి పురస్కారం అందిస్తారని తెలిపారు.
ఏలూరు (టూటౌన్): బడుగు, బలహీన వర్గాల ఆరాధ్యులు, భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంఘాలు కోరాయి. ఈమేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఏలూరు జిల్లా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు లక్కోజు రాజగోపాలాచారి మాట్లాడుతూ జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు.
నూజివీడు: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకూ ఆందోళన ఆగదని ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్పష్టం చేశారు. ఆందోళనలో భాగంగా 8వ రోజైన బుధవారం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డి.వేణుగోపాల్, జి.దుర్గాబాబు రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలకు సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి జి.రాజు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బొత్స శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జాడ సీతాపతిరావు, రాజేష్ పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి బుధవారం పాదయాత్ర భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా డిసెంబర్ 31న పినకడిమి వాసులు పెద్ద ఎత్తున క్షేత్రానికి కాలినడకన వచ్చి నూతన సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే పినకడిమికి చెందిన వేలాది మంది భక్తులు బుధవారం కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. పాదుకా మండప ప్రాంతంలో ఉన్న స్వామివారి కల్యాణ మండపం, తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపాల్లో విశ్రాంతి పొందారు. వారితో క్షేత్రంలోని దేవస్థానం, ప్రైవేట్ గదులు పూర్తిగా నిండిపోయాయి. గురువారం వారు స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి


