పదును తగ్గిన కొడవలి | - | Sakshi
Sakshi News home page

పదును తగ్గిన కొడవలి

Apr 24 2025 8:24 AM | Updated on Apr 24 2025 8:24 AM

పదును

పదును తగ్గిన కొడవలి

గణపవరం: ఒకప్పుడు వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషించిన కొడవలి క్రమంగా తన బాధ్యతలనుంచి దూరమైపోతుంది. గతంలో చేతిలో కొడవలి లేకుండా రైతు కనిపించేవాడు కాదు. ఉదయాన్నే చద్దన్నం తిని భుజాన తుండు వేసుకుని, చేతిలో కొడవలి పట్టుకుని పొలానికి పయనమయ్యేవాడు రైతు. కొడవలికి, రైతులకు అంతటి అనుబంధం ఉండేది. నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కొడవలి దాదాపు రైతుచేతికి దూరమైపోయింది.

ఇక వరికోతల సమయంలో కొడవళ్లకు ఎక్కడాలేని గిరాకీ ఉండేది. వ్యవసాయంలో యాంత్రీకరణతో సంప్రదాయ వ్యవసాయ పనిముట్లు కనుమరుగైపోయాయి. వీటి బాటలోనే కొడవలి కూడా చేరింది. దశాబ్దాలుగా వరికోతలకు కొడవళ్లే ఆధారం. వరికోతలు ప్రారంభం అయ్యాయంటే రైతులు, వ్యవసాయ కూలీలు కొత్త కొడవళ్ల కోసం కమ్మరి కొలిమి వద్ద బారులు తీరేవారు. పాత కొడవళ్లకు పదును పెట్టడం, కక్కుళ్లు కోయించడం, చెక్కపిడి వేయించడం, కొత్త కొడవళ్లు కొనుగోలు చేయడంతో కొడవళ్ల తయారీదారులకు ఊపిరి సలపనంతగా చేతినిండా పని ఉండేది. ఇటీవల వరికోతలు కోయడానికి కోత యంత్రాలు రంగప్రవేశం చేయడంతో కొడవళ్లకు పనిలేకుండా పోయింది. దీనితో ఈ వృత్తినే నమ్ముకున్న వారు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారు.

కొడవళ్ల తయారీ కేంద్రం ముప్పర్తిపాడు

గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామం కొడవళ్ల తయారీ కేంద్రంగా దశాబ్దాలుగా పేరొందింది. గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, ఉండి, అత్తిలి, పెంటపాడు, తణుకు తదితర మండలాలనుంచి రైతులు, కూలీలు ముప్పర్తిపాడు వచ్చి కొడవళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. కణకణలాడే అగ్నికీలల నుంచి ఎగసిపడే అగ్గిరవ్వలు, లయబద్ధమైన సుత్తిదెబ్బల సవ్వడులు, అగ్గిరాయిమీద కొడవళ్లకు పదును పెట్టి కక్కుళ్లుకోసే ధ్వనులు ఆ గ్రామంలో సర్వసాధారణం. ఈ కొడవళ్ల తయారీపై కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉండేవి. ఈ గ్రామంతో పాటు గణపవరం, నిడమర్రు గ్రామాల్లో కూడా కొడవళ్ల తయారు చేసే కమ్మరి కొలుములు ఉండేవి. వరికోతల సీజన్‌ ఆరంభం అయితే రేయింబవళ్లు కొడవళ్లు తయారు చేస్తూ క్షణం తీరిక లేకుండా కమ్మరి కార్మికులు ఇప్పుడు పనిలేక గోళ్లు గిల్లుకుంటున్నారు. గణపవరం, నిడమర్రు మండలాల్లో సుమారు 150 మంది వరకూ ఈ కమ్మరి కార్ఖానాలలో పనిచేస్తూ జీవనం సాగించేవారు. వేలాదిగా కొడవళ్లు తయారు చేసి స్థానికంగా అమ్మడమే కాక, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేసేవారు. ఒక్కో కొడవలి నాణ్యతను బట్టి రూ.100 నుంచి రూ.150 వరకూ విక్రయించేవారు. పదును పెట్టడానికి, కొడవలికి పళ్లు(కక్కుళ్లు) కోయడానికి రూ.20 తీసుకునేవారు. ఇప్పుడు రోజుకు పదో, పరకో కొడవళ్లు మాత్రమే అమ్ముతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు.

కొలిమిలో కాలి.. పదునైన కొడవలిగా మారి

కొడవలి తయారీకి ప్రత్యేకమైన ముడి ఇనుమును(లారీలకు వాడే కమానుకట్టలు) బద్దలుగా తీసుకువచ్చి కొలిమిలో బాగా కాల్చి కొడవలి ఆకారంలో మలుస్తారు. దానికి సానపట్టి పళ్లు కోసిన తర్వాత చెక్కపిడిని అమరుస్తారు. ఈవిధంగా ఒక్కో కొలిమిలో రోజుకు సుమారు 200 కొడవళ్లను తయారు చేస్తారు. నాణ్యతను బట్టి మూడు రకాలుగా కొడవళ్లు తయారు చేస్తారు. రూ.80, రూ.100, రూ.150 ధరలలో తయారుచేస్తారు. ప్రత్యేక ఇనుముతో పాటు ప్రత్యేకమైన రేకుతో కూడా కొడవళ్లు తయారు చేస్తారు.

కోత యంత్రాలతో

కనుమరుగవుతున్న కొడవళ్లు

వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక, నూతన సాంకేతిక పద్ధతులతో సంప్రదాయ పద్ధతులు కనుమరుగవుతున్నాయి. దీనిలో భాగంగా వరికోతకు యంత్రాల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇటీవలి వరకూ పశువులమేత కోసమైనా కొందరు రైతులు కూలీలతో వరికోతలు కోయించేవారు. రానురాను కూలీలతో కోత కోయించడం మానుకుని రైతులంతా వరికోత యంత్రాలమీదనే ఆధారపడటంతో కొడవళ్లు కొనే నాధుడు కనిపించడంలేదు.

ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు

కొడవళ్ల తయారీకి ఉపయోగించే బేల్‌ బద్దలను చైన్నె, విశాఖ, కాకినాడ, విజయవాడ పట్టణాల నుంచి కిలోల లెక్కన దిగుమతి చేసుకుంటారు. ముడిసరుకు ధరలు కూడా ఏటికేడు పెరగడంతో కొడవళ్ల తయారీ గిట్టుబాటు కావడంలేదని తయారీదారులు వాపోతున్నారు. గత ఏడాది లోడు బేల్‌బద్దలు రూ.50 వేలు పలుకగా ఈ ఏడాది రూ.65 వేలకు చేరిందని, ఆమేరకు కొడవళ్ల ధర పెంచితే కొనుగోలు దారులు వెనుకంజ వేస్తున్నారని వాపోతున్నారు. అలాగే కొలిమిలోకి వాడే బొగ్గు, ఊక ధరలు కూడా పెరిగిపోయాయని, పనిలోకి వచ్చేవారికి కూలీ ధరకూడా పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాంత్రీకరణతో కనుమరుగు

ఆదరణ తగ్గుతున్న వైనం

కొడవళ్ల తయారీకి ముప్పర్తిపాడు ప్రసిద్ధి

ఆదరణ తగ్గుతుంది

నేను 50 ఏళ్లుగా కొడవళ్లు తయారు చేస్తున్నాను. తాతలనాటి నుంచి వచ్చిన కమ్మరి వృత్తిలో ఇప్పుడు కుటుంబం గడవడమే గగనంగా ఉంది. గతంలో రోజుకు 100 వరకూ కొడవళ్లు అమ్మేవాళ్లం. దశాబ్ద కాలంగా కొడవళ్ల అమ్మకాలు బాగా పడిపోయాయి. ఇప్పుడు రోజుకు ఐదారు కొడవళ్లు కూడా అమ్ముడుపోవడం లేదు. వీటితో పాటు కత్తులు, పారలు, గునపాలు తయారు చేస్తున్నాం. రానున్న కాలంలో ఈవృత్తి బతికి బట్ట కట్టాలంటే ప్రభుత్వం కమ్మరి వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి, సబ్సిడీ ధరలకు ముడిసరుకులు అందించాలి. – సత్యనారాయణ, కమ్మరి వృత్తిదారు

పదును తగ్గిన కొడవలి 1
1/3

పదును తగ్గిన కొడవలి

పదును తగ్గిన కొడవలి 2
2/3

పదును తగ్గిన కొడవలి

పదును తగ్గిన కొడవలి 3
3/3

పదును తగ్గిన కొడవలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement