యుద్ధం కాదు... చర్చలే దిక్కు! | Sakshi Editorial On Israel and Iran Issues | Sakshi
Sakshi News home page

యుద్ధం కాదు... చర్చలే దిక్కు!

Jun 17 2025 12:25 AM | Updated on Jun 17 2025 12:25 AM

Sakshi Editorial On Israel and Iran Issues

ఏ యుద్ధంలోనైనా కనబడే దూకుడే అయిదోరోజుకల్లా ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఘర్షణలో కనబడుతోంది. ఎవరికెవరూ తీసిపోకుండా క్షిపణులు, బాంబులు యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. జనావా సాలను గురిచూస్తున్నారు. ప్రత్యర్థుల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఇజ్రా యెల్‌ విమానాల బాంబుదాడుల్లో 406 మంది ఇరాన్‌ పౌరులు మరణించగా, 654 మంది గాయపడ్డారని వాషింగ్టన్‌లోని మానవహక్కుల కార్యకర్తలు ప్రకటించారు. అటు రాజధాని టెల్‌ అవీవ్‌తో పాటు పలు నగరాలపై ఇరాన్‌ సాగించిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్‌లో 14 మంది మర ణించగా, 390 మంది గాయపడ్డారని అక్కడి సైన్యం తెలియజేసింది. 

తొలుత అణుకేంద్రాలపై దాడులు చేశామన్న ఇజ్రాయెల్‌ రెండోరోజు నుంచి నగరాలూ, పట్టణాలూ లక్ష్యంగా చేసుకుని బాంబులు ప్రయోగిస్తోంది. తయారీరంగ పరిశ్రమలనూ, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలనూ, పోలీస్‌ స్టేషన్లనూ, మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తోంది. ఒక్క తెహ్రాన్‌లోనే శని ఆదివారాల్లో 250 లక్ష్యాలను దెబ్బతీశామని చెబుతోంది. దక్షిణ ఇరాన్‌లోని ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయు క్షేత్రాన్ని, తెహ్రాన్‌ వెలుపల ఒక చమురు డిపోను ఇజ్రాయెల్‌ సైన్యాలు పేల్చివేశాయి.

అణ్వస్త్రాల తయారీకి ఇరాన్‌ చేరువలో ఉన్నదని, అందుకే దాడులకు దిగామని ఇజ్రాయెల్‌ ఇస్తున్న సంజాయిషీ బూటకం. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అది శుద్ధిచేసిన యురే నియం నిల్వలు ఉంచుకున్నా, బాంబు తయారీకి దరిదాపుల్లో లేదని సాక్షాత్తూ అమెరికా ఇంటెలి జెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్డ్‌ కొన్ని వారాల క్రితం తెలిపారు. అణు ఒప్పందం గురించి అమెరికా– ఇరాన్‌ల మధ్య చర్చలు సాగుతుండగానే హఠాత్తుగా  ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ అణు ఆరోపణ ఎందుకు చేసినట్టు? ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను అడ్డు తప్పించటానికి ఆ దేశంలో రసాయన ఆయుధాలున్నాయని కపట నాటకమాడిన అమెరికా అడుగుజాడల్లో ఇజ్రాయెల్‌ నడుస్తోంది. 

ఆ సాకుతో సద్దాంను తప్పించి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిద్దామని అప్పట్లో అమెరికా, నాటో దేశాలు భావించాయి. కానీ జరిగిందంతా వేరు. రసాయన ఆయుధాల జాడలేదు సరిగదా... ఉగ్రవాదం మరింతగా విజృంభించింది. ఇప్పటికీ ఇరాక్‌ కుదుట పడలేదు. అఫ్గాన్, లిబియా, యెమెన్, సిరియాలు సైతం అదే దుఃస్థితిలో ఉన్నాయి. ప్రధాని నెతన్యాహూ రెండు లక్ష్యాలతో ఇరాన్‌పై విరుచుకుపడ్డారు. మతాచార్యుడు ఖమేనీ కనుసన్నల్లోని పాలకవ్యవస్థను పడగొట్టి అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం ప్రతిష్ఠించటం అందులో ఒకటైతే, రెండోది స్వదేశంలో తాను కోల్పోయిన పరువు తిరిగి పొందటం. 

అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసినా ఇరాన్‌లో తమకు అనుకూలమైన వారిని ప్రతిష్ఠించటం అసాధ్యం. ఆ రోజులు పోయాయి. 1970వ దశకం వరకూ ఇరాన్‌ను పాలించిన షా రెజాపెహ్లావీ వంటి అమెరికా కీలుబొమ్మ ఆ దేశంలో కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం లేదు. ఇరాన్‌ ప్రతిఘటిస్తున్న తీరు చూస్తే నెతన్యాహూ రెండో లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కనబడటం లేదు. పాలస్తీనాలో దిక్కూ మొక్కూలేని నిస్సహాయ పౌరులపై అమెరికా సరఫరా చేసిన మారణా యుధాలతో విరుచుకుపడటం వేరు. ఇప్పుడు ఇరాన్‌ జోలికి పోవటం వేరు. 

ఇరాన్‌ పౌరులకు తమ ప్రభుత్వంపై ఎంతైనా వ్యతిరేకత ఉండొచ్చుగానీ, కొన్ని దశాబ్దాలుగా వారంతా నిత్యం యుద్ధ రంగంలోనే ఉన్నారు. ఇప్పుడంటే సౌదీతో ఒక మేరకు స్నేహసంబంధాలు ఏర్పడ్డాయిగానీ ఆ దేశం కూడా ఇరాన్‌పై కత్తికట్టినదే. గతంలో ఇరాక్‌తో వైరం ఏర్పడినప్పుడు వరసగా పదేళ్లపాటు యుద్ధం సాగించిన దేశం ఇరాన్‌. ఎంతగా అమెరికా మద్దతున్నా ఈ మాదిరి సుదీర్ఘ యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ ఆర్థికవ్యవస్థ తట్టుకోవటం అసాధ్యం. ఆ మాటకొస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థే అంతటి మహాయుద్ధాన్ని భరించే స్థితిలో లేదు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట పలు దేశాల్లో నాటో కూటమితో కలిసి సాగించిన యుద్ధాల పర్యవసానంగా ఇప్పటికే అమెరికా నిండా మునిగింది. 

దాని ప్రస్తుత రుణం 36 లక్షల కోట్ల డాలర్లు. ఆర్థికవ్యవస్థకొచ్చే ఆదాయంలో సింహ భాగం దానిపై వడ్డీలకే ఖర్చవుతోంది. ఇజ్రాయెల్‌కు వత్తాసుగా ఇరాన్‌తో వైరం పెట్టుకుంటే ఆ సుదీర్ఘ పోరు మరో పదిలక్షల కోట్ల డాలర్లను ఆవిరిచేస్తుంది. తాను అధికారంలోకొస్తే ‘అనవసర యుద్ధాల’ నుంచి అమెరికాను తప్పిస్తానని, ఒక్క సైనికుడు కూడా విదేశీగడ్డపై ఉండే అవసరం రాదని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ఊదరగొట్టారు. అందుకే ‘ఇజ్రాయెల్‌ జోలికెళ్తే ఖబడ్దార్‌’ అంటూ ట్రంప్‌ ఇరాన్‌ను హెచ్చరించటాన్ని స్వపక్షంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు.  

ఇప్పటికీ మించిపోయింది లేదు. అణు చర్చలకు సిద్ధమంటోంది ఇరాన్‌. కాకపోతే ఇజ్రాయెల్‌ వద్ద పుష్కలంగా అణ్వాయుధాలుండగా... పౌర అవసరాలకు సైతం యురేనియం వాడకాన్ని అను మతించబోమనటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అంటున్నది. నిజానికి ఒబామా హయాంలో అమెరికా ఆ వెసులుబాటు ఇవ్వటం వల్లనే 2015లో అణు ఒప్పందం సాకారమైంది. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్‌ ఆ ఒప్పందాన్ని కాలరాశారు. 

ఇజ్రాయెల్‌ సృష్టించిన ఈ ఊబి నుంచి బయటపడాలంటే ఇప్పటికీ ట్రంప్‌కు ఆ ఒప్పందమే దిక్కు. ఈ నాలుగు రోజుల్లో డాలర్‌ విలువ పదిశాతం తరిగిపోయింది. ఇరాన్‌తో చర్చించి సమస్య పరిష్కారానికి సాయపడతామని జర్మనీ విదేశాంగమంత్రి యోహాన్‌ వాదెఫుల్‌ ముందుకొచ్చారు. అందుకు సిద్ధపడటమే అమెరికా ముందున్న ఏకైక మార్గం. కాదంటే ఇవాళ పశ్చిమాసియా కావొచ్చుగానీ... రేపు ప్రపంచమే పెను సంక్షోభంలో పడుతుంది. అప్పుడు ఆర్థిక పతనం నుంచి అమెరికాను ఎవరూ కాపాడలేరు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement