నిడదవోలు: సమిశ్రగూడెం ఎస్సీ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు, స్తంభానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో లో వోల్టేజ్ సమస్యలు తీరాయి. 100 కేవీ సామర్ధ్యం గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో అలంకార ప్రాయంగా మారింది. దీనిపై ఈ నెల 23న సాక్షిలో ప్రచురించిన కథనానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాలపై సోమవారం ట్రాన్స్ఫార్మర్కు, స్తంభానికి కనెక్షన్ ఇచ్చి విద్యుత్ సరఫరా చేశారు.
ముగిసిన పవిత్రోత్సవాలు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు మూడో రోజు మహా పూర్ణాహుతితో అత్యంత వైభవంగా ముగించారు. టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, హోమాలు, సేవలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు దంపతులు, కమిటీ సభ్యులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


