కిర్లంపూడి: రాజకీయాల్లో స్ఫూర్తి ప్రదాతగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం నిలుస్తారని, ఆయన మృతి తీరని లోటని వైఎస్సార్ సీపీ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చేరుకుని ముద్రగడ పద్మనాభం సతీమణి ముద్రగడ పద్మావతి, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ఆయన పెద్ద కుమారుడు ముద్రగడ వీరరాఘవరావు (బాలు)ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలసి ముద్రగడ సమాధికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముద్రగడ పద్మనాభంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ముద్రగడను ఎప్పుడు కలిసినా, ఎంతోగానో గౌరవించేవారని, ఆయన వైఎస్సార్ సీపీలోకి వచ్చిన తరువాత మరింత అనుబంధాలు బలపడ్డాయని తెలిపారు. ఆయన ఎప్పుడు తిరుపతి వచ్చినా తనను కలిసేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త తనను కలిచి వేసిందన్నారు. స్వామి మాల ధరించి ఉండడంతో ఇప్పటి వరకు రాలేకపోయామని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ఆయన లేనిలోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు తోట నరసింహం, కురసాల కన్నబాబు, పేర్ని నాని, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పెద్దాపురం, పి.గన్నవరం, రామచంద్రపురం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాష్, పాముల రాజేశ్వరీదేవి, పినిపే శ్రీకాంత్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీ కృష్ణంరాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, రాజానగరం, తుని నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు తోట రామకృష్ణ, వాసిరెడ్డి జమీల్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు ఉన్నారు.


