రాజమహేంద్రవరం సిటీ: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న వంటి మహనీయులను అంతా స్మరించుకోవాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా స్థానిక వై.జంక్షన్లో ఆయన విగ్రహానికి బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భరత్రామ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను హరించేలా ప్రభుత్వాలు కుట్రలు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, దాని అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, రైతులు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ధీరుడు గౌతు లచ్చన్న అని కొనియాడారు. నాయకులు దాసి వెంకటరావు, మార్గాని సురేష్, బిల్డర్ చిన్న, గుత్తుల భాస్కరరావు పాల్గొన్నారు.
● సర్దార్ గౌతు లచ్చన్న పోరాటాలు, ఉద్యమాలు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. వై.జంక్షన్లోని లచ్చన్న విగ్రహానికి ఆమె నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివకుమార్, మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, పెంకే సురేష్, పోలాకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
● అలాగే వై.జంక్షన్లో లచ్చన్న విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేశారు.
సీటీఆర్ఐ: స్థానిక వై.జంక్షన్ వద్ద గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత సంక్షేమ సంఘం, విగ్రహ ఆవిష్కరణ కమిటీ గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డిరాజు పాల్గొన్నారు.


