రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ప్రకాష్నగర్లోని జక్కంపూడి రాజా కార్యాలయం వద్ద ఆర్యాపురం ఆటో కార్మికులకు ఈఎస్ఐ కార్డులు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు స్ఫూర్తితో కార్మిక వర్గానికి అండగా ఉంటున్నామని వెల్లడించారు. నగరంలోని అన్ని ఆటో యూనియన్లను సమన్వయం చేసి, ప్రతి ఆటో కార్మికుడికి ఈఎస్ఐ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో షేక్ షాజహాన్ బాషా, పోలాకి శ్రీనివాస్, పాలూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిలిచిపోయిన రాకపోకలు
వీఆర్పురం: అన్నవరం బ్రిడ్జి వర్షాలకు కొట్టుకుపోయిన సంగతి విదితమే. నాటి నుంచి సుమారు 50 గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల లోలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు కానీ పూర్తి కాలేదు. వర్షాలు పడుతుండటంతో ఆవైపు బస్సులు తిరగడం లేదు. మండల కేంద్రానికి వచ్చే వారిపై అధిక భారం పడుతుంది. ఆటోలు, టాటా మేజిక్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. రాత్రి కురిసిన వర్షానికి బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.


