
మందూ వెనకా చూడకుండా..
సాక్షి, రాజమహేంద్రవరం: ముందూ వెనకా చూడడం లేదు.. జనారోగ్యం పట్టించుకోవడం లేదు.. మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా పట్టించుకోవడం లేదు.. ప్రజలతో తప్ప తాగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది.. మందుబాబులం.. మేం మందుబాబులం.. అంటూ అర్ధరాత్రయినా రోడ్డుపై పడేలా కిక్కు ఇస్తోంది.. సంపద సృష్టే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది.. మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటోంది.. ఈ క్రమంలో ఇప్పటికే మద్యం పాలసీలో సమూల మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వ మద్యం విధానాన్ని పక్కనబెట్టి, ప్రైవేట్కు కట్టబెట్టి రూ.కోట్లు గడించింది. మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూమ్లు పెట్టుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మరింత ఆదాయం పెంచుకుంది. తాగాగా మరో విధానానికి శ్రీకారం చుట్టింది. నూతన బార్ పాలసీని తీసుకు వస్తోంది. అనుకున్నదే తడువుగా రంగంలోకి దిగింది. ఇందుకు గాను ఇటీవల ఎకై ్సజ్ ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిర్వహించింది. నూతన పాలసీ, ప్రజలకు మద్యం ఇంకా సంపూర్ణంగా అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ఎక్కడ బార్లు ప్రారంభిస్తే ఎక్కువగా తాగుతారు..? అనే విషయాలపై సమగ్రంగా చర్చించింది. రాష్ట్ర వైన్ డీలర్ల సంఘం, స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్లు కొత్త పాలసీపై వెల్లడించిన అభిప్రాయాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో బార్లలో విక్రయాలు ఎలా ఉండాలన్న విషయాలపై చర్చించారు. కొత్త విధానం ద్వారా ఆదాయం పెంపొందించడమే లక్ష్యంగా ముందు కెళ్లాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు పాత బార్ల పాలసీ ముగియనుండగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది. ఇందుకు ఎకై ్సజ్ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
‘తూర్పు’లో 25 బార్లు
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 బార్లు ఉన్నాయి. ఇందులో 3 బార్లు కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేయగా, మిగిలినవి ఓపెన్ క్యాటగిరీలో కేటాయిస్తారు. ఇందులో రాజమహేంద్రవరంలో 19, కొవ్వూరులో 2, నిడదవోలులో 3 బార్లు ఉండగా.. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం టూరిజం ప్రదేశాల్లో బార్లకు అనుమతులు రానున్నాయి. కడియపులంకలో ఒక బార్కు అనుమతి ఇవ్వనున్నారు.
ఫీజు వసూళ్లు ఇలా..
మున్సిపల్ కార్పొరేషన్కు 10 కిలోమీటర్ల లోపు బార్ ఏర్పాటు చేసుకునే వారికి ఒక్కో బార్కు ఏడాదికి రూ.70 లక్షల ఫీజుగా నిర్ధారించారు. నిడదవోలులో రూ. 37.50 లక్షలుగా నిర్ణయించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించే షాపులకు ఫీజులో 80 శాతం రాయితీ కల్పిస్తారు. బార్లకు దరఖాస్తు ఫీజును సైతం పెట్టారు. అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 26 వరకూ ఓపెన్ కేటగిరీ బార్లకు దరఖాస్తులకు సమయం ఇచ్చారు. కల్లుగీత కార్మికులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
మరింత కిక్కో కిక్కు..!
ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయం పొందేందుకు ప్రజలకు మద్యం కిక్కు ఎక్కిస్తోంది. ఇప్పటికే మందుబాబులు తప్పతాగి రహదారులపై తూలుతున్నారు. అది చాలదన్నట్లు మరింత కిక్కు ఎక్కించేందుకు బార్లు తెరిచి ఉంచే సమయాన్ని సైతం ప్రభుత్వం పెంచింది. గతంలో బార్ రాత్రి 11 గంటల వరకు నడుపుకొనేందుకు అనుమతి ఉండేది. అయినా రాత్రి 12 వరకూ అలాగే నడిపేవారు. ఆ సమయాన్ని కాస్త, అధికారికంగా రాత్రి 12 గంటలకు పెంచింది. ఇదే అదునుగా భావించే బార్ల యజమానులు తెల్లవారు జామున 3 గంటల వరకూ నడిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే జరిగితే రాత్రంతా తాగడం.. రహదారులపై రచ్చ చేయడం జరుగుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే తాగి గొడవలకు దిగుతున్నారని, మహిళలపై అసభ్యంగా ప్రవరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాత్రంతా కూర్చోబెట్టి తాగిస్తే శాంతిభద్రతలు అదుపుతప్పే పరిస్థితి లేకపోలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
పర్మిట్ రూమ్లకు గ్రీన్ సిగ్నల్
మద్యం ద్వారా ప్రస్తుత ఆదాయం చాలదన్నట్లు భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఆదాయం మరింత పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులు ఉండగా.. అందుకు అనుగుణంగా 125 పర్మిట్ రూమ్లు వెలుస్తున్నాయి. అక్కడే మద్యం తాగేందుకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. ఇలా జనం ఊగి తూగేలా చేస్తోంది.
సంపద సృష్టే లక్ష్యంగా ‘కూటమి’ అడుగులు
ఇప్పటికే మద్యం షాపుల వద్ద
పర్మిట్ రూములు
తాజాగా నూతన బార్ల విధానం
రూపకల్పన
తప్ప తాగేందుకు మరో గంట పొడిగింపు

మందూ వెనకా చూడకుండా..