స్నేహితులతో సరదాగా బీచ్‌కు.. ఎంతో ఇష్టంగా కొనుకున్న కొత్త బైకే ప్రాణం తీసింది!

Young man Died In Road accident Near Vizag Beach Road - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్న బైక్‌పై సరదాగా డ్రైవ్‌ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, కుంతుర్ల గ్రామానికి చెందిన పూటి గిరి ప్రసాద్‌ నాయుడు(19) పాడేరులో మదర్‌ కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. స్నేహితుడు జె.జగదీష్‌తో కలసి బైక్‌పై బుధవారం విశాఖలో బంధువులు ఇంటికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి స్నేహితుడితో కలసి బైక్‌పై నగరం చూడడానికి బయలుదేరాడు. రాత్రయినా ఇంటికి చేరకుండా తిరిగారు.

ఈ క్రమంలో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత బీచ్‌రోడ్డులో తెన్నేటి పార్కు నుంచి సాగర్‌నగర్‌ వైపు వెళ్తుండగా సీతకొండ చివరి మలుపు వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్‌ డివైడర్, దానిపై ఉన్న ఎలక్ట్రికల్‌ పోల్‌ను ఢీకొంది. దీంతో కిందపడిన గిరిప్రసాద్‌ తలకు తీవ్రగాయమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన స్నేహితుడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.

గురువారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఆ యువకుడి కుటుంబ సభ్యులకు అçప్పగించారు. మృతుడి అక్క పి.ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గిరి తండ్రి మత్సలింగం నాయుడు ఉపాధ్యాయుడు. అమ్మ, అక్క ఉన్నారు. ఎంతో ఇష్టంగా ఇటీవల కొనుక్కొన్న కొత్త బైకే కుమారుడి ప్రాణాలు తీసిందంటూ మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ బైక్‌పై సరదాగా విశాఖ వచ్చి, ప్రాణాలు తీసుకున్నాడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 
చదవండి: భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల్లంతు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top