వాట్సప్‌ చివరి స్టేటస్‌.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని..

Student Suicide By Hanging At Polytechnic College In Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు/విశాఖపట్నం: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన అమ్మ చీరతోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం పాత ఆదినారాయణ సంత సమీపంలోని గుల్లేపల్లి గ్రామానికి చెందిన వెసలపు పాతబాబు, నారాయణమ్మ దంపతుల కుమారుడు వి.వరుణ్‌ సాయి (17) ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో మెకానికల్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో హాస్టల్‌ నెల రోజుల క్రితమే తెరుచుకుంది. హాస్టల్‌ వార్డెన్‌ కరోనా రావడంతో సెలవులో ఉన్నాడు. హాస్టల్‌లో ఉంటున్న వరుణ్‌వాసు పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి గత ఆదివారం హాస్టల్‌కు తిరిగి వచ్చాడు.  

తరగతులకు వెళ్లకుండా.. 
ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి హాస్టల్‌ వదిలి క్లాసులకు వెళ్లడం లేదు. ఏమిటి అంటే ఆరోగ్యం బాగోలేదని చెబుతుండడంతో సహచర విద్యార్థులు పట్టించుకోలేదు. వచ్చేటప్పుడు చీరె తీసుకొని వచ్చాడు. చీరె ఎందుకు తెచ్చావు అంటే మా అమ్మది.. కప్పుకోవడానికి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. గురువారం నుంచి వీరికి మిడ్‌ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు వరుణ్‌వాసు హాజరుకాకపోవతుండటంతో తోటి విద్యార్థులు అడిగితే ప్రస్తుతం ప్రిపేర్‌ కాలేదని, చివరి పరీక్షల్లో బాగా మార్కులు తెచ్చుకుంటానని చెప్పాడు. శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్‌ విద్యార్థులతో కలిసి భోజనం చేసి తన గదికి వెళ్లాడు.  

కొద్ది సేపటికి.. 
కొద్దిసేపటి తరువాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వరుణ్‌వాసు తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో వాళ్లు హాస్టల్‌ గది తలుపుని బలవంతంగా తెరిచి ఫ్యాన్‌కు వేలాడుతున్న అతనిని చీరె నుంచి తప్పించి హాస్టల్‌ వాచ్‌మన్‌కు ఫోన్‌ చేశారు. వాచ్‌మన్‌ వచ్చి అప్పటికే స్పృహ లేకుండా ఉన్న వరుణ్‌ను రిమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు నిర్థారించారు. 
చదవండి: డ్రగ్స్ కేసు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ప్రధాన నిందితుడు టోనీ


చివరి వాట్సప్‌ స్టేటస్‌ 

వాట్సప్‌ స్టేటస్‌లో..
కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి రిమ్స్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు హాస్టల్‌లో విద్యార్థులను విచారించారు. వరుణ్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై అతని వాట్సప్‌ను పరిశీలించగా అందులో స్టేటస్‌ ‘డెత్‌...దిడే పీపుల్‌ విల్‌ టాక్‌ గుడ్‌ ఎబౌట్‌ యు...గుడ్‌బై ’ అని పోస్టు చేసి ఉంది. దీంతో అతను ఈ పోస్టును ఎవరిని ఉద్దేశించి చేశాడనేది తెలియలేదు.  
చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు 

తల్లిదండ్రులకు సమాచారం.. 
వరుణ్‌ కాలేజీలో విద్యార్థులందరితో కలివిడిగా ఉంటాడని, మంచివాడు అంటూ చెబుతున్నారు. పోలీసులు విషయాన్ని వైజాగ్‌లోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రాథమికంగా తమ విచారణలో కాలేజీకి సంబంధించి బాలునికి ఎటువంటి సమస్యలు లేవని తేలిందని, అంతే కాకుండా సెలవుల నుంచి కాలేజీకి వచ్చినప్పటి నుంచి తరగతులకు కూడా హాజరుకాలేదని తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనే దానిపై బాలుని తల్లిదండ్రులు వచ్చిన తరువాత వారు చెప్పే సమాధానం, బాలుని వాట్సప్‌ సందేశాలను పరిశీలించిన తరువాత పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top