సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

Software Engineer Deceased in Road accident Vizianagaram District - Sakshi

గంట్యాడ(విజయనగరం జిల్లా): ఒకరు బతుకు బాటలో.. మరొకరు స్నేహితునితో కలిసి విహారయాత్రలో ఉన్నారు. వీరిద్దరినీ రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. వారి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. గంట్యాడ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన నేమాల కృష్ణ (60) స్కూటర్‌పై దుస్తులు ఇంటింటికీ తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గంట్యాడకు చెందిన కొందరు చీరలు కావాలని ఫోన్‌ చేయడంతో బండిపై శనివారం బయలు దేరాడు.

అదే సమయంలో స్నేహితుడి వివాహంలో పాల్గొనేందుకు విజయనగరం వచ్చిన గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రామచంద్రారెడ్డి(22), అనకాపల్లికి చెందిన నున్న కళ్యాణ్‌ బైక్‌పై తాటిపూడి జలాశయం చూసేందుకు బయలుదేరారు. గంట్యాడ పెట్రోల్‌ బంక్‌ దాటిన తర్వాత వీరి ద్విచక్రవాహనాలు రెండూ కొర్లాం సమీపంలో ఎదురెదురుగా ఢీకొట్టడంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. తలలకు బలమైన గాయాలు కావడంతో రామచంద్రారెడ్డి, నేమాల కృష్ణ ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కళ్యాణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని వైద్యం కోసం 108 వాహనంలో విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top