ధర్మారం(బి)లో చిన్నారిపై హత్యాచారం..?

six year girl molested by man in dichpally Nizamabad - Sakshi

సాక్షి, డిచ్‌పల్లి (నిజామాబాద్‌రూరల్‌): డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వారం కిందట జరిగినా పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను వెంటతీసుకుని ధర్మారం(బి) గ్రామానికి నాలుగు నెలల క్రితం  వలసవచ్చాడు. తామిద్దరం భార్యాభర్తలమని చెప్పి ఒకరి వద్ద కూలీ పనికి చేరాడు. ఆ మహిళకు మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు ఆడ పిల్లలు తమకు అడ్డుగా భావించాడు. వారం క్రితం రాత్రి పూట ఆరేళ్ల వయస్సున్న పెద్ద కూతురు పై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆపై ఆమె  తలపై రాయితో కొట్టి గాయపర్చాడు.

అనంతరం చిన్నారికి ఫిట్స్‌ వచ్చాయని మహిళతో చెప్పి హడావిడి చేసి, చికిత్స పేరిట జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించాడు. చిన్నారి  పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అనంతరం అతడు వారిని వదిలి పరారయ్యాడు. అనుమానం వచ్చిన చిన్నారి తల్లి తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే తన కూతురుపై అత్యాచారం చేశాడని డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయమై డిచ్‌పల్లి పోలీసులు స్పందించలేదు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top