యడియూరప్పపై పోక్సో కేసు | Senior BJP Leader And Former Karnataka CM BS Yediyurappa Booked Under Section Of POCSO Act | Sakshi
Sakshi News home page

యడియూరప్పపై పోక్సో కేసు

Mar 16 2024 5:09 AM | Updated on Mar 16 2024 5:14 AM

Senior BJP Leader And Former Karnataka CM BS Yediyurappa Booked Under Section Of POCSO Act - Sakshi

ఆరోపణలను ఖండించిన కర్ణాటక మాజీ సీఎం

సాక్షి, బెంగళూరు: బీజేపీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(81)పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354ఏ కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె తల్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు.  ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా ముందుకు వెళతానన్నారు.

పోలీసులు డాలర్స్‌ కాలనీలోని యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని డీజీపీ అలోక్‌ మోహన్‌ శుక్రవారం చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం వెంటనే కేసును సీఐడీకి అప్పగించామన్నారు.ఈ పరిణామంపై హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు చెప్పారన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు బాలిక చిత్రీకరించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.  

ఆమె ఏడుస్తూ సాయం అర్థించింది
కేసు నమోదు కావడంపై యడియూరప్ప స్పందించారు. ఈ కేసుకు సంబంధించి చట్ట పరంగా ముందుకెళతానన్నారు. ‘ఆ మహిళ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆమెను లోపలికి రమ్మని చెప్పి, సమస్య తెలుసుకున్నా. ఆ వెంటనే పోలీస్‌ కమిషనర్‌ దయానందతో ఫోన్‌లో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరా. ఆ వెంటనే ఆమె నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో, ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చింది’అని చెప్పారు. ఆమె పోలీస్‌ కమిషనర్‌ను కలిశాక, వ్యవహారం మలుపు తిరిగిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement