మామ అని బైక్‌ఇప్పిస్తే.. కనబడకుండా పోయాడు..

Man Self Destruction In Nizamabad - Sakshi

సాక్షి, భిక్కనూరు(నిజామాబాద్‌): మేనమామకు తన పేరు మీద బైక్‌ ఇప్పిస్తే ఆయన కనబడకుండా పోయాడు. ఫైనాన్స్‌ వారు తనకు ఫోన్‌ చేయడంతో డబ్బు ఎలా కట్టాలని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మండలంలోని పెద్దమల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌ కుమార్‌ తెలిపిన వివరాలు..పెద్దమల్లారెడ్డికి చెందిన నడిపొల్ల బాలయ్య(29)కు బీబీపేటకు చెందిన శ్యాగ రాజు మేనమామ అవుతాడు. శ్యాగ రాజు బాలయ్య పేరిట ఫైనాన్స్‌లో ద్విచక్రవాహనం తీసుకున్నాడు.

తీసుకున్న అప్పును సగం మాత్రమే రాజు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్‌ వారు బాలయ్యకు డబ్బులు చెల్లించాలని ఫోన్‌  చేస్తున్నారు. బైక్‌ తీసుకున్న రాజు కనించకపోవడం, ఆయన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వస్తుండటంతో బాలయ్య ఆందోళనకు గురయ్యాడు. 15 రోజులుగా ఈ విషయమై తీవ్రంగా మదనపడుతున్నాడు.

ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం గ్రామశివారులోని డబులు బెడ్‌ రూం ఇళ్ల సమీపంలో చెట్టుకు బాలయ్య ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలయ్య భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top