ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు
కందనూలు: వడ్ల వ్యాపారంలో జరిగిన లావాదేవీల తో మనస్పర్థల కారణంగా స్నేహితులే ఓ వ్యక్తిని హ త్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన ఎండీ హసన్ (36) ఈ నెల 22న స్నేహితులు పానుగంటి అరవింద్, వీరకారి శివాజీతో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు.
షాద్నగర్ టోల్గేట్ దాటిన తర్వాత అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో ఈ నెల 23న హసన్ సోదరుడు ఎండీ హాజీ షాద్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా బూర్గుల ప్రాంతంలోని ట్రూ ల్యాండ్ మార్క్ వెంచర్ సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 25వ తేదీ ఉదయం హసన్ బంధువులు చివరి లోకేషన్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా.. కాశిరెడ్డిగూడ శివారులో ట్రూ ల్యాండ్ మార్క్ వెంచర్లో పొదల మధ్య హసన్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్ సాయంతో అధారాలు సేకరించారు.
వడ్ల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆర్థిక వివాదాల నేపథ్యంలో హసన్ స్నేహితులే హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడవేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని షాద్నగర్ పోలీసులు తెలిపారు.


