
( ఫైల్ ఫోటో )
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం ఆయన సొంత ఇంటిలో రక్తమడుగులో పడి ఉన్నారు. 68 ఏళ్ల ఓం ప్రకాష్.. పడి ఉన్న ఫ్లోర్ అంతా రక్తంతో నిండిపోయింది.
ఆయన ఒంటిపై తీవ్ర గాయాలున్నాయని పోలీస్ అధికారి స్పష్టం చేశారు. అయితే ఓం ప్రకాష్ చనిపోయిన విషయాన్ని ఆయన భార్య పల్లవి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భార్య పల్లవిని, ఆయన కూతుర్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంటి నుంచి ఆయన భార్య పల్లవి తమకు సమాచారం అందించిందని, తాము అక్కడకు వెళ్లే సరికి మృతదేహం స్విమ్మింగ్ పూల్ లో ఉందని పోలీసులు తెలిపారు. ఆ పూల్ అంతా రక్తంతో నిండి ఉండగా, ఫ్లోర్ కూడా రక్తం తడిసిముద్దయ్యిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, ప్రస్తుతం ఆయన మృతికి సంబంధించి భార్య పల్లవిని, కూతుర్ని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఆయనకు గతంలో బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది చంపుతామనే బెదిరింపులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఒకానొక సందర్భంలో ఓమ్ ప్రకాష్ కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు.
1981 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఓమ్ ప్రకాష్. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓమ్ ప్రకాష్.. జియోలజీలో ఎంఎస్సీ చేశారు. కర్ణాటక రాష్ట్ర డీజీపీగా 2015 మార్చి 1వ తేదీన నియమించబడ్డారు.