
పీఎం పాలెం(భీవిులి)/ దొండపర్తి(విశాఖ దక్షిణ) : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ కేసులో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివారాలిలా ఉన్నాయి. కోలా వెంకటహేమంత్కుమార్, ఉలవల రాజేష్, బమ్మిడి రాజేష్ మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులను ఈ నెల 15వ తేదీన కిడ్నాప్ చేశారు.
బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సుమారు రూ.1.75 కోట్లు వసూలు చేయడంతో పాటు బంగారు నగలు లాక్కున్నారు. నగర పోలీస్ కమిషనర్కి ఎంపీ ఘటనపై ఫోన్లో తెలియజేయగా పోలీసులు బృందాలుగా ఏర్పడి సినీ ఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి ఆటకట్టించారు. కిడ్నాప్నకు గురైన ఎంపీ భార్య, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రధాన నిందితుడైన కోలా వెంకటహేమంత్కుమార్, అతడికి సహకరించిన ఉలవల రాజేష్, న్యాయవాది బమ్మిడి రాజేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇదే కేసులో నిందితులుగా ఉన్న యర్రోలు సాయి(19), బాడితబోయిన బాలాజీ(24)ను ఆనందపురం హైవే కూడలి వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. దమ్ము ఆనందబాబు (26)ను ఆదర్్శనగర్ హైవే రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిదీ గాజువాక. వీరి నుంచి రూ.10 లక్షలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. మైనర్లను జువైనల్ హోమ్కు తరలించామన్నారు.
విశాఖ ఎంపీ ఎంవీవీకి భద్రత పెంపు
ఎంపీ ఎంవీవీకు భద్రత పెంచారు. ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)కు కూడా భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీని హేమంత్కుమార్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో పోలీసులు హేమంత్కుమార్, రాజేష్, సాయితో పాటు మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎంపీకి టూ ప్లస్ టూ, అతని కుటుంబ సభ్యులతో పాటు జీవీకి వన్ ప్లస్ వన్ భద్రతా సిబ్బందిని కేటాయించారు